మొదట్లో మోడీ ఖిలాఫ్గా ఉండె: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు, చంద్రబాబుపై నిప్పులు
ఖానాపూర్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, టీఎస్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం ఖానాపూర్ ప్రజా ఆశీర్వాద సభ బహిరంగ సభలో మాట్లాడారు. ఎన్నికలు వస్తాయి పోతాయని, ప్రజలు మాత్రం శాశ్వతం అని చెప్పారు. గెలవాల్సింది నాయకులు కాదని ప్రజలని చెప్పారు. ఈ ఎన్నికల్లో విచక్షణతో ఓటేయాలని చెప్పారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే తనకు వచ్చే నష్టమేమీ లేదని తేల్చి చెప్పారు. గెలిస్తే నేను ప్రజల కోసం పని చేస్తానని లేదంటే ఇంటి వద్ద పడుకుంటానని చెప్పారు. తద్వారా తెరాసను గెలిపించకుంటే ప్రజలే నష్టపోతారని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రారంభ ఏడాదిలో మోడీ ఖిలాఫ్గా ఉండెనని చెప్పారు. అంటే మనకు వ్యతిరేకంగా ఉండెనని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దీంతో ఇప్పుడు ఎలా ఉన్నారనేది చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రం బాగుపడాలని చెబుతున్నా
అనుకున్న అభివృద్ధి జరగాలనుకుంటే సరైన నాయకుడిని గెలిపించాలని కేసీఆర్ చెప్పారు. ఎవరిని గెలిపించాలనే అంశంపై ప్రతి ఇంట్లో మాట్లాడుకోవాలనిచెప్పారు. రాష్ట్రం బాగుపడాలని తపనపడే వ్యక్తిగా తాను చెబుతున్నానని, ప్రజలు గెలిచే రాజకీయానికి ఓటు వేయాలన్నారు. యాభై ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీలు ఏం చేశాయని ప్రశ్నించారు. ఈ నాలుగేళ్లలో మేం ఏం చేశాం, ఇన్నాళ్లు ఆ పార్టీలు ఏం చేశాయో బేరీజు వేసుకోవాలన్నారు.
58 ఏళ్లు పాలించి సమస్యలు పక్కకు పెట్టారు
రైతులకు 24 గంటల విద్యుత్ కేవలం తెలంగాణలోనే ఇస్తున్నామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ వస్తే కరెంట్ రాదని ప్రచారం చేశారని, తద్వారా మనలను భయాందోళనకు గురిచేసే ప్రయత్నాలు చేశారని చెప్పారు. 58 ఏళ్లు పాలించిన వారు అన్ని సమస్యలను పక్కన పెట్టారని విమర్శించారు. గత ప్రభుత్వం హయాంలో కరెంట్ మోటార్లు కాలిపోయేవన్నారు. సంక్షేమ పథకాలు ఎలా అవుతున్నాయో ప్రజలు తెలుసుకోవాలన్నారు.
చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించా
దశాబ్దాల పాటు పాలించిన నేతలు ఏం చేయకుండా, ఇప్పుడు మాత్రం కిరీటం పెడతామని చెబుతున్నారని కేసీఆర్ ఎద్దేవా చేసారు. రూ.12వేల కోట్లు ఖర్చు చేసి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. నేను చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించానని చెప్పారు. తెలంగాణ సాధించాక ఏడాదికి పైగా అనేక సమస్యలు ఎదురయ్యాయని చెప్పారు. మేం ఏం సాధించామే మీకు (ప్రజలకు) ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
కేసీఆర్ను కొట్టడం చేతకాక చంద్రబాబును తెచ్చారు
కేసీఆర్ను కొట్టడం కాంగ్రెస్ పార్టీకి చేతకాలేదని, అందుకే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును తెచ్చుకున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కత్తి ఆంధ్రావాడిది అయినా పొడిచేవాడు తెలంగాణవాడే అన్నారు. చంద్రబాబు హైకోర్టు విభజనను అడ్డుకున్నారని ఆరోపించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమం సమయంలో రాష్ట్రం కోసం ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా చేయలేదని చెప్పారు. మహాకూటమి గెలిస్తే మళ్లీ ఆంధ్రా నేతలతో పంచాయతీ వస్తుందన్నారు. చంద్రబాబు ప్రాజెక్టులు ముందుకు సాగనివ్వడం లేదన్నారు.
రైతు బంధుతో అన్నదాతకు మేలు జరుగుతోందన్నారు. ఎరువుల కోసం రైతులు గతంలో ఇబ్బందులు పడేవారన్నారు. ఇప్పుడు అలా లేదని చెప్పారు. నిరుద్యోగ భృతి రూ.3వేలు ప్రకటించామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కష్టాలు తప్పవని చెప్పారు. ప్రయివేటు ఆసుపత్రుల దోపిడీ నుంచి పేదవాడిని రక్షిస్తున్నామని చెప్పారు. ఒక్కో నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని చెప్పారు.