తెలంగాణా బీజేపీలో పార్టీ ఫండ్ చిచ్చు.. రంగంలోకి అమిత్ షా షాడో టీమ్?
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణ బిజెపిలో ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓటమికి గల కారణాలను పోస్టుమార్టం చేసిన బీజేపీ నేతలు పలువురు అసెంబ్లీ ఎన్నికల ఖర్చు విషయంలో సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారి అధిష్టానం దీనిపై సీరియస్ గా ఫోకస్ చేసేలా మారింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఖర్చుల లెక్కల పై బీజేపీ హైకమాండ్ ఫోకస్ చేస్తుంది. ఎన్నికల సందర్భంగా వచ్చిన పార్టీ ఫండ్ పక్కదారి పట్టిందని ఆరోపణలు పార్టీలోని పలువురు నేతలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఫండ్ విషయంలో పలువురు బీజేపీ అభ్యర్థులు ఢిల్లీ పెద్దలకు కూడా ఫిర్యాదులు చేశారు. ఎన్నికలలో ఖర్చులకోసం పార్టీ పంపించిన ఫండ్ క్రిందిస్థాయి వరకు చేరకపోవడంతో సెగ్మెంట్లలో ఓటమి పాలయ్యామని అభ్యర్థులు అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తున్నారట.

ఈ క్రమంలోనే అసలు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో ఏం జరిగింది? బిజెపి ఓటమికి గల కారణాలు ఏమిటి? తెలంగాణ ఎన్నికల సమయంలో ఖర్చులకోసం పంపించిన బీజేపీ పార్టీ ఫండ్ ఏమైంది? వంటి అనేక అంశాలపై అమిత్ షాకు చెందిన షాడో టీమ్ రంగంలోకి దిగి సమాచారం సేకరిస్తుంది అని తెలుస్తుంది.
2023 లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో విజయం సాధించాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నికలను తీసుకున్న బిజెపి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను మూడు కేటగిరీలుగా విభజించి ఫండ్ కేటాయించిందని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. ఏ కేటగిరి అంటే గెలిచేదిగా, బి కేటగిరీ అంటే కొంచెం కష్టపడితే గెలిచేదిగా, సీ కేటగిరి అంటే గెలిచే ఛాన్స్ లేకపోయినా పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడమే లక్ష్యంగా నిధులు సమకూర్చారని చెబుతున్నారు.
ఈ విధంగా కేటాయించిన ఫండ్ చాలా నియోజకవర్గాలలో క్షేత్రస్థాయిలోకి చేరలేదని, ఫలితంగా తాము ఓటమి పాలయ్యామని బిజెపి నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం తెలంగాణా బీజేపీలో రచ్చగా మారింది.












Click it and Unblock the Notifications