నన్నే రోడ్డుమీద ఆపుతారా.. మహిళలపై పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆగ్రహం!!
ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలను పరిష్కరించాలి. కానీ ఆ పని చేయకుండా, సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజల పైన విరుచుకుపడుతున్న ఎమ్మెల్యేలు ఎంతోమంది ఉన్నారు. ఇక ఆ కోవలోనే తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే సమస్యను చెప్పుకోవడానికి తన కాన్వాయ్ ని అడ్డుకున్న మహిళలపై విరుచుకుపడ్డారు.
రోడ్డు కోసం ఎమ్మెల్యే వాహనానికి అడ్డుగా నిలబడ్డ మహిళలు
అసలు ఇంతకీ ఏం జరిగిందంటే సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో కొత్తగా మంజూరైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న మహిపాల్ రెడ్డి అక్కడి నుంచి తిరిగి ప్రయాణమైన నేపథ్యంలో దోమడుగులో ఎమ్మెల్యే వాహనానికి మహిళలు అడ్డంగా నిలబడ్డారు. తమ గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ దోమడుగు గ్రామంలోని మెదక్- హైదరాబాద్ జాతీయ రహదారిపై కారుకు అడ్డంగా నిలుచున్నారు మహిళలు.
మహిళల సమస్యలు వినకుండా ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యేకు తమ గోడు చెప్పుకోవడానికి ఇదే మార్గమని భావించిన మహిళలు చేసిన పని ఎమ్మెల్యేకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. రోడ్డుపై మహిళలు అడ్డంగా నిలబడగా, వాహనం ఆపిన ఎమ్మెల్యే ఎందుకు రోడ్డుకు అడ్డంగా నిల్చున్నారు అని ప్రశ్నించారు. స్థానిక సర్పంచ్ తమ వార్డులో సిసి రోడ్లు వేయనంటున్నాడని, అందువల్ల మీ దృష్టికి తీసుకు రావడానికి రోడ్లపైకి వచ్చామని మహిళలు ఎమ్మెల్యేకి వివరించే ప్రయత్నం చేశారు. అయితే మహిపాల్ రెడ్డి వారిపై అగ్రహం వ్యక్తం చేశారు.
రోడ్డు కోసం నన్నే ఆపుతారా? రోడ్డు వెయ్యం పొమ్మన్న ఎమ్మెల్యే
నన్నే రోడ్డు మీద ఆపి రోడ్డు వెయ్యాలని అడుగుతారా? కొత్త రోడ్డు వేసేదే లేదు పొండి అంటూ కోపోద్రిక్తుడయ్యారు. మహిళలందరూ కారు వద్దకు వెళ్లి తమ గ్రామంలో రోడ్లు వేయాలని చేతులు జోడించి మరీ ప్రాధేయ పడుతున్నా, తమ విజ్ఞాపన ఎమ్మెల్యేకు చెప్తున్నా కనీసం కారు దిగకుండా ఎమ్మెల్యే మహిళలతో మాట్లాడిన తీరు గ్రామస్తుల ఆగ్రహానికి కారణంగా మారింది.
మళ్ళీ ఎన్నికలప్పుడు వస్తే గుణపాఠం చెప్తామంటున్న మహిళలు
ఎమ్మెల్యే వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మహిపాల్ రెడ్డికి గుణపాఠం చెప్పి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై కావాలనే కొందరు ప్రతిపక్ష పార్టీ నాయకులు, మహిళలను రెచ్చగొట్టి రోడ్డుపైన అడ్డంగా నిలబెట్టాలని అధికార పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆ విధంగా స్పందించారని స్పష్టం చేస్తున్నారు.