అనూహ్యం: గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ-జనసేన ఉమ్మడి పోరు: కాస్సేపట్లో పవన్తో బండి సంజయ్ భేటీ
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్సొరేషన్ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవట్లేదని, ఒంటరిగానే పోటీ చేస్తామంటూ ప్రకటించిన భారతీయ జనతా పార్టీ యూటర్న్ తీసుకుంది. ఏపీలో మిత్రపక్షంగా కొనసాగుతోన్న జనసేన పార్టీతో కలిసి ఉమ్మడిగా ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకుంది. బీజేపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చోటు చేసుకోనుంది. సీట్ల సర్దుబాటు కోసం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర పార్టీ నాయకులు.. కాస్సేపట్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్తో భేటీ కానున్నారు.
ఆస్ట్రేలియా సిరీస్కు టీమిండియా స్పెషలిస్ట్ బౌలర్: చీఫ్ సెలెక్టర్ దృష్టిలో: కఠోర సాధన
తలోదారిగా రెండు పార్టీలు..
ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. తెలంగాణకు వచ్చే సరికి ఈ రెండు పార్టీలూ తలోదారి అన్నట్లు వ్యవహరించాయి. తెలంగాణలో కలిసి సాగడంపై ఎలాంటి నిర్ణయాలూ ఇప్పటిదాకా తీసుకోలేదు ఆ రెండు పార్టీల అధినేతలు. దీనితో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా వేర్వేరుగానే పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని అటు బండి సంజయ్.. ఇటు పవన్ కల్యాణ్ ప్రకటించారు కూడా. గ్రేటర్ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామంటూ వారిద్దరూ వేర్వేరుగా ప్రకటనలు చేశారు.
కేంద్రం నుంచి..
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి పోటీ చేయాలంటూ బీజేపీ అగ్ర నాయకత్వం నుంచి ఆదేశాలు అందడం వల్లే తెలంగాణ కమలనాథులు తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకున్నట్లు చెబుతున్నారు. సికంద్రాబాద్ లోక్సభ సభ్యుడు, కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి జీ కిషన్ రెడ్డి ఈ విషయంలో చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పవన్ కల్యాణ్కు లక్షలాది మంది అభిమానులు ఉండటం, జనసేన పార్టీకి కొద్దో, గొప్పో క్యాడర్ ఉండటాన్ని సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ తాజా నిర్ణయాన్ని తీసుకుందని అంటున్నారు.
ఉమ్మడి శతృవును ఎదుర్కొనడానికి..
రాజకీయంగా బీజేపీకి ప్రధాన శతృ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సమితి. మొన్నటి దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నికను చావోరేవోగా తీసుకున్నారు కమలం పార్టీ నేతలు. చివరికి విజయాన్ని అందుకున్నారు. దుబ్బాక పోరు ముగిసిన వెంటనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. దుబ్బాక ఇచ్చిన ఊపును జీహెచ్ఎంసీ బరిలోనూ కొనసాగించడానికి ఉవ్విళ్లూరుతోంది. ఈ పరిస్థితుల్లో జనసేనను కలుపుకోకుండా ఒంటరిగా పోటీ చేయడం వల్ల కొద్దిమేరకైనా ఓట్లు చీలుతాయనే అభిప్రాయం బీజేపీ అంచనా వేస్తోంది.
ఓట్ల చీలికను నివారించడానికే..
ఓట్ల చీలికను నివారించడానికి పవన్ కల్యాణ్తో సీట్ల సర్దుబాటు కోసం మంతనాలు నిర్వహించనుంది బీజేపీ. డివిజన్ స్థాయిలో పరిమితంగా ఓట్లు పోల్ అవుతుంటాయి. ఉన్న ఆ కొద్ది ఓట్లల్లో కూడా చీలక ఏర్పడటమంటూ జరిగితే.. టీఆర్ఎస్ లాభపడుతుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల పవన్ కల్యాణ్ అభిమానులు.. గంపగుత్తగా తాము నిలబెట్టిన లేదా తాము మద్దతు ఇచ్చిన జనసేన అభ్యర్థికి ఓట్లు వేస్తారని భావిస్తున్నారు.
Recommended Video
కాస్సేపట్లో పవన్తో భేటీ
మారిన ఈ పరిణామాల నేపథ్యంలో.. బండి సంజయ్ కాస్సేపట్లో పవన్ కల్యాణ్తో భేటీ కానున్నారు. ప్రశాసన్ నగర్లోని జనసేన పార్టీ కార్యాలయానికి ఆయన వెళ్లనున్నారు. బండి సంజయ్ వెంట..మాజీ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, గోషా మహల్ ఎమ్మెల్యే టీ రాజాసింగ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, గ్రేటర్ హైదరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జీలు వెళ్లనున్నారు. పవన్ కల్యాణ్.. ఆ పార్టీ నేతలతో భేటీ కానున్నారు. సీట్ల సర్దుబాటుపై చర్చించబోతున్నారు. ఈ భేటీ ముగిసిన అనంతరం ఇద్దరు నేతలు ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లను కేటాయించాలనే విషయంపై ఈ భేటీ ముగిసిన తరువాత స్పష్టత రానుంది.