గద్దర్కు ఏమైంది?- పవన్ కల్యాణ్ పరామర్శ
హైదరాబాద్: ప్రజా యుద్ధ నౌక గద్దర్ అనారోగ్యానికి గురయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు ముంచుకొస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన రాజకీయంగా తీరిక లేని సమయాన్ని గడుపుతున్నారు. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ పనుల్లో ఉన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గద్దర్ ఉద్యమిస్తోన్నారు. అటు రాజకీయంగానూ క్రియాశీలకంగా ఉంటోన్నారు. బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కొనడానికి సన్నాహాలు చేస్తోన్నానంటూ గతంలో కొన్ని సందర్భాల్లో ప్రకటించారు గద్దర్.

ఈ క్రమంలో గద్దర్ ప్రజా పార్టీ పేరును కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించుకోవడానికీ ఏర్పాట్లు చేసుకున్నారు. కొద్దిరోజుల కిందట ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనగర్జన సభకూ గద్దర్ హాజరయ్యారు. కాంగ్రెస్కు వెంట ఉంటానని ప్రకటించారు. కేసీఆర్ పతనం ఆరంభమైందని, తెలంగాణ సమాజం ఆలోచనలకు భిన్నంగా ప్రభుత్వం పని చేస్తోందంటూ మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలను కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్నాననీ అప్పట్లో చెప్పుకొచ్చారాయన. ఈ పరిస్థితుల మధ్య గద్దర్ అనారోగ్యానికి గురయ్యారు. అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల అలసట, అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది.
అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన గద్దర్ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. గద్దర్ ఆసుపత్రిలో చేరారనే సమాచారం తెలుసుకున్న పవన్ కల్యాణ్.. ఆసుపత్రికి బయలుదేరి వెళ్లారు. ఆయనను పరామర్శించారు. అనారోగ్యానికి గురి కావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications