తెలంగాణలో ఏమౌతుందో చూద్దాం: పవన్ కళ్యాణ్, బాబుకు 'రాయలసీమ' హెచ్చరిక
పెనుమాక: తెలంగాణ ప్రజల డిమాండ్ సరైనదని, వారు దానిని సాధించుకున్నారని, అక్కడ ఏమవుతుందో చూద్దామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదివారం అన్నారు.
ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని అమరావతికి భూమి ఇచ్చేందుకు నిరాకరిస్తున్న పెనుమాక గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా టిడిపి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు
ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక తెలంగాణ కోరుకున్నారని, అందుకే నాడు తాను మాట్లాడలేదని చెప్పారు. అప్పుడు తనను అడిగారని, కానీ తెలంగాణ కోసం ఆత్మహత్యలు కూడా జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారి డిమాండు సరైనదే అన్నారు.
కులాల సమస్యపై హెచ్చరిక
తెలంగాణకు అన్యాయం జరగడం వల్ల ఉద్యమం వచ్చిందని, ఇప్పుడు కులాల సమస్య ఏపీలో తేవద్దన్నారు. తనకు కులంను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
చంద్రబాబుకు 'రాయలసీమ' హెచ్చరిక
రాష్ట్ర విభజన వల్ల రాయలసీమ ఎక్కువగా నష్టపోయిందని చెప్పారు. వారు ఎంతో బాధపడుతున్నారన్నారు. చంద్రబాబు దృష్టి ఎప్పుడు రాజధాని పైనే ఉంటుందా అనే ఆందోళన కనిపిస్తోందని, రాయలసీమలో తెలంగాణలా మరో ఉద్యమం కనిపిస్తోందా టిడిపి ఆలోచించాలన్నారు.
టిడిపి నేతలు తనను చేసిన వ్యాఖ్యలు బాధించాయన్నారు. చంద్రబాబు సీఎం పదవిలో ఉన్నారని, ఆయన పదవిని అగౌరవపర్చే ఉద్దేశ్యం తనకు లేదన్నారు.
జగన్ కంటే చంద్రబాబుకు ఎక్కువ అనుభవం ఉందని నమ్మానని, ఇప్పటికీ నమ్ముతున్నానన్నారు. ప్రజల నుంచి సేకరించకుండానే గొప్ప రాజధాని కట్టుకునేంత భూమి రాష్ట్రంలో ఉందన్నారు. రాజకీయాల్లో తాను ఏ పక్షమూ కాదని, ప్రజల పక్షమే అన్నారు.