బస్సు ప్రమాదం కలచివేసింది: పవన్ కళ్యాణ్, మాజీ కేంద్రమంత్రి మృతిపై...
పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద జరిగిన బస్సు ప్రమాదం పైన స్పందించారు. అలాగే, సోమవారం మృతి చెందిన మాజీ కేంద్రంత్రి శివశంకర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద జరిగిన బస్సు ప్రమాదం పైన స్పందించారు. అలాగే, సోమవారం మృతి చెందిన మాజీ కేంద్రంత్రి శివశంకర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద బస్సు ప్రమాదం తనను కలచివేసిందని, తీవ్ర ఆవేదనకు గురి చేసిందని పేర్కొన్నారు. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రయివేటు బస్సు వంతెన పై నుంచి కల్వర్టులో పడటం చూస్తుంటే నోటమాట రావడం లేదన్నారు.

భద్రతా చర్యలు తీసుకోవాలి
పదకొండు మంది ఈ దుర్ఘటనలో మృతి చెందడం బాధాకరమన్నారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు మరిన్ని భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రోడ్డు ప్రమాదాల్లో ఒక్క ప్రాణం కూడా పోకుండా చూసుకోవాలన్నారు. ఈ బాధ్యత మనందరి పైన ఉందన్నారు.

నష్టపరిహారం ఇవ్వాలి
ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు తగినంత నష్టపరిహారం అందించాలని, క్షతగాత్రులను మేలయిన వైద్య సాయం అందివ్వాలన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

శివశంకర్ మరణంపై..
శివశంకర్ మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని మరో ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన రాజకీయ శైలి, వాగ్ధాటి ఎన్నటికీ మరువలేవిని అన్నారు. ప్రజా ప్రతినిధిగా, కేంద్రమంత్రిగా, గవర్నర్గా ఆయన దేశానికి, తెలుగు ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.

ప్రజారాజ్యం పార్టీలో..
ప్రజారాజ్యంలో ఆయనతో కలిసి పని చేసిన రోజులను ఎన్నటికీ మరువలేనని చెప్పారు. ప్రజా సమస్యల పైన శివశంకర్కు ఉన్న అవగాహన, వాటిని పరిష్కరించడంలో ఆయన చూపిన చొరవ తనను ఆకట్టుకుందన్నారు.
స్వతహాగా న్యాయవాది అయిన శివశంకర్ మాటల్లో సున్నితమైన విచక్షణ కూడా కనబడేదన్నారు. అటువంటి నాయకత్వ లక్షణాలు కొందరిలోనే చూస్తుంటారని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభతి తెలియచేస్తున్నానన్నారు.












Click it and Unblock the Notifications