సెక్షన్ 8: పవన్ కళ్యాణ్కు ఇబ్బందేనా, బీజేపీ వైపా, టీడీపీ వైపా?
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం నాడు సాయంత్రం నాలుగున్నర గంటలకు తెలుగు రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిస్థితుల పైన పెదవి విప్పనున్నారు. అయితే, సెక్షన్ 8 పవన్ కళ్యాణ్కు ఒకింత ఇబ్బందికర పరిణామమేనని అంటున్నారు.
ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 అంశాలు కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలలో రాజకీయ వేడిని రాజేస్తోన్న విషయం తెలిసిందే. సెక్షన్ 8 అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం, ఏపీ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ టీడీపీ నేతలు కూడా దానిని తప్పు పట్టడం లేదు.
అయితే, తెలంగాణలోని మిగతా పార్టీలు అన్నీ సెక్షన్ 8 వద్దని చెబుతున్నాయి. టీడీపీ మిత్రపక్షం బీజేపీ కూడా సెక్షన్ 8 అవసరం లేదని చెబుతోంది. హైదరాబాదులో ఏ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు లేవని తెలంగాణ బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు చెబుతున్నాయి.
ఏపీ కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు కూడా సెక్షన్ 8ను ఇప్పుడు తెరపైకి తీసుకు రావడాన్ని తప్పుపడుతున్నాయే తప్ప సెక్షన్ 8 వద్దని చెప్పడం లేదు. సెక్షన్ 8 అవసరమే అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అయితే, ఇప్పటికే హైదరాబాదులో సెక్షన్ 8 అమలవుతోందని చెప్పింది.
సెక్షన్ 8 గవర్నర్ చేతిలో ఉంది. హైదరాబాదులో శాంతిభద్రతలకు భంగం కలిగినప్పుడు గవర్నర్ తన చేతిలో సెక్షన్ 8 ఉపయోగించవచ్చు. ఒకవిధంగా సెక్షన్ 8 విషయంలో చంద్రబాబు ఏకాకి అయ్యారని చెప్పవచ్చు.
ఫోన్ ట్యాపింగ్, ఓటుకు నోటు అంశాల పైన పవన్ కళ్యాణ్ నుండి దాదాపు స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం కావొచ్చని అంటున్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి తప్పు చేస్తే శిక్ష పడాల్సిందేనని, అలాగే ఫోన్ ట్యాపింగ్ కూడా తప్పు అని ఆయన చెప్పే అవకాశాలున్నాయని అంటున్నారు.
అయితే, సెక్షన్ 8 విషయంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతారనే ఆసక్తి అందరిలోను నెలకొంది. సెక్షన్ 8ను టీడీపీ కోరుకుంటోంది. అలాగే తెలంగాణ బీజేపీ, ఒకవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కోరుకోవడం లేదు.
అదేవిధంగా సెక్షన్ 8కు అనుకూలంగా మాట్లాడితే ఒక ప్రాంతం నుండి, వ్యతిరేకంగా మాట్లాడితో మరో ప్రాంతం నుండి పవన్ కళ్యాణ్కు విమర్శలు వచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సెక్షన్ 8 పైన ఆయన పెద్దగా మాట్లాడకపోవచ్చునని చెబుతున్నారు. లేదా పొడిపొడిగా హైదరాబాదులో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు.