మోదీ- పవన్ ఒకే వేదికపై: సీట్ల పంపకాలపై సస్పెన్స్
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. ప్రచార జోరు పెరిగింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. రాజెవరు? బంటు ఎవరు? అనేది తేలిది అప్పుడే.

ఈ క్రమంలో బీజేపీ గేరు మార్చింది. ఈ నెల 7వ తేదీన భారీ బహిరంగ సభను నిర్వహించబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కొందరు కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ స్థాయి నాయకులు ఈ సభకు హాజరు కానున్నారు. సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీని తరువాత పోలింగ్ సమయానికి మూడు నుంచి అయిదుచోట్ల మోదీ సభలను ఏర్పాటు చేయాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది.

తెలంగాణలో జనసేనతో పొత్తు కుదిరిన నేపథ్యంలో- ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సైతం ఈ సభలో పాల్గొననున్నారు. ప్రధాని మోదీతో కలిసి మరోసారి వేదికను పంచుకోనున్నారు. 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం- బీజేపీ కూటమికి పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పట్లో మోదీ, చంద్రబాబుతో కలిసి బహిరంగ సభలకు హాజరయ్యారు.

మోదీ సభ నేపథ్యంలో- తెలంగాణ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి.. పార్టీ రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్తో కలిసి ఆదివారం రాత్రి పవన్ కల్యాణ్తో సమావేశం అయ్యారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇందులో పాల్గొన్నారు. మోదీ సభకు హాజరు కావాలంటూ ఆహ్వానించారు.
సీట్ల పంపకాల అంశం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చింది. 32 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా.. దీనిపై ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని కిషన్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వారిద్దరూ మరోసారి భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకట్రెండు రోజుల్లో సీట్ల పంపకాలు ఖరారు కావొచ్చు.












Click it and Unblock the Notifications