తెలంగాణాలో పవన్ కళ్యాణ్ పర్యటన.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ కుటుంబాలకు పరామర్శ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మే 20 వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి పర్యటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్ కళ్యాణ్ పార్టీ కోసం పనిచేసిన క్రియాశీల కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడానికి, పార్టీ కార్యకర్తలతో మాట్లాడటానికి పర్యటన చేయనున్నట్టు జనసేన పార్టీ ప్రకటించింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 20వ తేదీన తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నట్టు ఆ పార్టీ నల్గొండ జిల్లా ఇన్చార్జి మేకల సతీష్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళుతూ మధ్యలో పవన్ కళ్యాణ్ చౌటుప్పల్ లో ఆగుతారని, ఆపై కోదాడకు వెళ్తారని జనసేన పార్టీ వెల్లడించింది. వలిగొండ మండలం లక్కారం గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త సైదులు రోడ్డు ప్రమాదంలో ఇటీవల మరణించిన నేపథ్యంలో, అతని భార్య, పిల్లల్ని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు.
20న శ్రీ @PawanKalyan గారు ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన pic.twitter.com/uERNoQwPmK
— JanaSena Party (@JanaSenaParty) May 19, 2022
ఇక పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో చౌటుప్పల్ లో జనసేన పార్టీ కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. చౌటుప్పల్ సమీపంలోని లక్కారం గ్రామానికి వెళ్లి పవన్ కళ్యాణ్ కొంగరి సైదులు కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కు అందజేస్తారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కోదాడకి వెళ్తారు. అక్కడ కడియం శ్రీనివాసరావు కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారు.
వారికి కూడా ఆర్థిక సహాయాన్ని అందజేసి అక్కడి నుండి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళతారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో జనసేన పార్టీ తెలంగాణ విభాగం ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తుందని జనసేన పార్టీ అధికారికంగా ఒక ప్రకటన చేసింది. చాలా కాలం తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణా రాష్ట్రంలో పర్యటన చేస్తుండటం గమనార్హం.