Posani Krishna Murali ఇంటిపై రాళ్ల దాడి-అర్థరాత్రి వేళ ఘటన: సీసీ ఫుటేజ్ ఆధారంగా..!!
నాలుగు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్తల్లో నిలిచిన సినీ నటుడు పోసాని క్రిష్ణ మురళీ ఇంటి పైన రాళ్ల దాడి జరిగింది. సినీ హీరో పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వం పైన విమర్శలు చేసారు. దీనికి స్పందనగా ఏపీ మంత్రులతో పాటుగా వైసీపీ మద్దతు దారుడిగా ఉన్న పోసాని సైతం స్పందించారు. పవన్ పైన ఆరోపణలు చేసారు. కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ఆ తరువాత మరుసటి రోజున హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్ లో మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.
ఆ సమయంలో తాను పవన్ పైన వ్యాఖ్యలు చేసిన తరువాత కొందరు తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడారని..కంటిన్యూ ఫోన్లు చేస్తున్నారంటూ పోసాని చెప్పుకొచ్చారు. ఆ సమావేశ సమయంలోనే పవన్ అభిమానులు .. జనసైనికులు పోసానిని అడ్డుకొనే అవకాశం ఉందని సమాచారం సేకరించిన పోలీసులు ప్రెస్ క్లబ్ వద్ద పెద్ద ఎత్తున బందో బస్తు ఏర్పాటు చేసారు. ఇక, అదే ప్రెస్ మీట్ లో పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పవన్ పైన దూషణలకు దిగారు. వ్యక్తిగతంగా తిట్టటంతో పాటుగా కుటుంబ సభ్యుల పైనా దూషణలు చేసారు.
దీంతో..పవన్ అభిమానులు ప్రెస్ క్లబ్ వద్దకు అభిమానులు చేరుకున్నారు. పోసాని పైన దాడికి అవకాశం ఉందంటూ వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ తరువాత పోలీసులు తమ రక్షణ లో ఇంటికి తరలించారు. పవన్ పైన తాను ఫిర్యాదు చేస్తానని పోసాని చెప్పుకొచ్చారు. అయితే, అర్ద్రరాత్రి హైదరాబాద్ లోని అమీర్ పేట ఎల్లారెడ్డి గూడాలోని పోసాని ఇంటి పైన రాళ్ల దాడి చేసారు. అయితే, ఆ ఇంట్లో పోసాని లేరు. వాచ్ మెన్ కుటుంబం ఆ ఇంటి పైన రాళ్ల దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసారు.
పోసాని దంపతుల పైన బూతులు తిడుతూ రాళ్లతో దాడి చేసారంటూ వాచ్ మెన్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో..అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ ప్రారంభించారదు. పోసాని పైన దాడి చేస్తాం..ఆయన్ను వదిలేది లేదంటూ ఆ గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించారని ఆ నివాసంలో ఉంటున్న వాచ్ మెన్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాళ్ల దాడి జరిగిన సమయంలో పది మంది వరకు ఉన్నారని..తాము ఆ దాడి నుంచి తప్పించుకున్నామని చెప్పుకొచ్చారు.
పోసాని కృష్ణ మురళి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి#PosaniKrishnaMurali #oneindiatelugu pic.twitter.com/68b5HdTO8A
— oneindiatelugu (@oneindiatelugu) September 30, 2021
ఇక, వీరు చెబుతున్న సమాచారం ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇప్పుడు ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. పోసాని కుటుంబం మాత్రం ఎనిమిది నెలలుగా ఆ ఇంట్లో ఉండటం లేదు. జరిగిన విషయం వాచ్ మెన్ ద్వారా తెలుసుకున్న పోసాని పోలీసులతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు సంజీవరెడ్డి నగర్ పీఎస్ లో ఫిర్యాదు నమోదు చేసారు.