Revanth Reddy: రూ.35వేల కోట్ల పంచాయతీ నిధులు మళ్లీంచారు: రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ అంటే భస్మాసుర సమితి అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. సర్పంచుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని అన్నారు. ఆస్తులు అమ్మి, అప్పులు చేసి సర్పంచులు గ్రామాల్లో పనులు చేశారని చెప్పారు. పనులకు సకాలంలో బిల్లులు రాక ఇప్పటికే పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. రూ.35వేల కోట్ల పంచాయతీ నిధులను కేసీఆర్ సర్కార్ దారి మళ్లించిందని ఆరోపించారు. ఆ నిధులతో మెఘా కృష్ణారెడ్డి, ప్రతిమ శ్రీనివాస్ల కాంట్రాక్టులకు బిల్లలు కట్టారని విమర్శించారు. సర్పంచుల సమస్యలపై ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన ధర్నాలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
గ్రామాల్లో చెట్లు చనిపోతే సర్పంచ్లను సస్పెండ్ చేస్తున్నారని అన్నారు. గతంలో జీహెచ్ఎంసీకి బ్యాంకుల్లో రూ.600 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండేవన్నారు. కేసీఆర్ పాలనలో జీహెచ్ఎంసీకి అప్పు కూడా పుట్టని పరిస్థితి వచ్చిందని రేవంత్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల ఖాతాల్లో ఉన్న నిధులను ట్రెజరీకి చూపించి రుణాలు పొందే ప్రయత్నం చేస్తుందన్నారు.

సర్పంచులపై పోలీసుల నిఘా ఉందని రేవంత్ ఆరోపించారు. రాష్ట్రంలో నిరసన తెలిపే అవకాశం కూడా లేకుండా పోయిందని రేవంత్ ఆరోపించారు. సర్పంచులు ఆస్తులమ్మి అభివృద్ధి పనులకు ఖర్చు పెట్టారని.. ప్రభుత్వం వెంటనే మళ్లించిన నిధులను వారికి జమ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదన్నారు. జీతాల కోసం 28వేల కోట్ల అప్పు తెచ్చారని ఆరోపించారు












Click it and Unblock the Notifications