ప్రజా యుద్ధనౌక గద్దర్ ఇక లేరు
హైదరాబాద్: ప్రజాగాయకుడు, ప్రజా యుద్ధనౌక పేరొందిన గద్దర్(77) కన్నుమూశారు. గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చేరిన గద్దర్.. చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. తన మాటనే పాటగా మలిచిన గొప్ప కళాకారుడిగా పేరు పొందారు గద్దర్. కోట్లాది మందిని కదిలించిన విప్లవకారుడు ఇకలేరనే విషయం చాలా మందిని ఆవేదనకకు గురిచేస్తోంది.
తెలంగాణ ఉద్యమంలో తన పాట ద్వారా ఉద్యమానికి ఊపు తీసుకొచ్చారు గద్దర్ (Gaddar). తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చెబుతూ పాటలతో ఎంతోమందికి స్ఫూర్తి నింపారు. ఈ మధ్యనే గుండె ఆపరేషన్ చేయించుకున్నారు గద్దర్. ఈ క్రమంలో అనారోగ్యంతో గద కొద్ది రోజుల క్రితం అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఆదివారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గద్దర్.. పీపుల్స్ వార్, అనంతరం మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో తన గళంతో కోట్లాది మంది ప్రజలను ఉత్తేజపరిచారు. అలాంటి గద్దర్ ఆకస్మిక మరణంతో తెలంగాణ ఉద్యమ నేతలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలచుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గద్దర్.. శేషయ్య, లచ్చమ్మ దంపతులకు 1949లో తూప్రాన్లో జన్మించారు. దళిత కుటుంబంలో జన్మించిన గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావ్. నిజామాబాద్, హైదరాబాద్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన 1975లో కెనరా బ్యాంకులో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయనకు భార్య విమల. ముగ్గురు పిల్లలు(సూర్యుడు, చంద్రుడు, వెన్నెల). జన నాట్యమండలి వ్యవస్థాపకుల్లో గద్దర్ కూడా ఒకరు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
తన పాటలతో ఉద్యమాలకు మరింత ఊపుతెచ్చారు. 1987లో కారంచేడు దళిత హత్యలపై గద్దర్ అవిశ్రాంతంగా పోరాటం చేశారు. నకిలీ ఎన్కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే 1997 ఏప్రిల్ 6న గద్దర్పై హత్యాయత్నం జరిగింది. బుల్లెట్లు తన శరీరంలోకి దూసుకెళ్లాయని పలుమార్లు చెప్పారాయ. కాగా, అమ్మా తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద పాటలతో ఉద్యమాలకు ఊపుతెచ్చారు గద్దర్. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ అనే పాటకు నంది అవార్డు వరించింది. అయితే, ఆ అవార్డును గద్దర్ తిరస్కరించారు.












Click it and Unblock the Notifications