తెలంగాణలో ముందస్తు అవసరం లేదు, ఇలా నష్టం: సుప్రీం కోర్టులో పిటిషన్
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణలో ముందస్తు ఎన్నికలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. గడువు కంటే ముందే ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజలకు నష్టమని చెబుతూ సిద్దిపేటకు చెందిన శశాంక్ రెడ్డి భారత అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
తెలంగాణలో నిర్ణీత సమయానికి అసెంబ్లీ ఎన్నికలు జరిగితే దాదాపు ఇరవై లక్షల మందికి పైగా కొత్తగా ఓటు హక్కును పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ముందస్తు ఎన్నికలు వస్తే వారు ఓటు హక్కు కోల్పోతారని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాసే విధంగా ముందస్తుకు వెళ్తున్నారన్నారు.
ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు
ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం లేదు
తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏమాత్రం లేదని పిటిషనర్ తెలిపారు. ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజార్టీ ఉందని గుర్తు చేశారు. ఎన్నికల సంఘంతో మాట్లాడామని, ఆ తర్వాతే ముందస్తుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారని, ఇది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
కేసీఆర్ అలా ఎలా చెబుతారు?
అంతేకాకుండా, ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయాన్ని కూడా కేసీఆర్ చెప్పారని పిటిషనర్ పేర్కొన్నారు. అలా ఎలా చెప్పగలరన్నారు. మళ్లీ తానే ముఖ్యమంత్రిని అవుతానని కూడా ఎలా చెప్పగలరని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ సంక్షోభం లేదని, అత్యవసర పరిస్థితులు కూడా లేవని, అలాంటప్పుడు ఈ నిర్ణయం సరికాదన్నారు.
గవర్నర్ పాలన విధించండి
రాజకీయపరమైన లబ్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమైందని సుప్రీం కోర్టుకు పిటిషనర్ తెలిపారు. అన్నింటిని పరిగణలోకి తీసుకొని తెలంగాణలో గవర్నర్ పాలన విధించాలని విజ్ఞప్తి చేశారు. 2019లో అన్ని ఎన్నికలతో పాటు వీటికీ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో గవర్నర్ పాలన ఉంటే ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతుందని చెప్పారు.
హైకోర్టు కొట్టి వేసింది
కాగా, ముందస్తు ఎన్నికలు ఆపాలంటూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ను మంగళవారం హైకోర్టు కొట్టేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఓటర్ల జాబితా సవరణలు పూర్తికాలేదని, అర్హులైన లక్షలాది మంది ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయని, అందుకే ముందస్తు ఎన్నికలను నిలపాలని కొమ్మిరెడ్డి విజయ్ వ్యక్తి హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఓటరు జాబితాలో సవరణలకు తగిన గడువు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే అర్హులైన ఓటర్లకు అన్యాయం జరుగుతుందన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పిటిషన్ను కొట్టేసింది. ఎన్నికల కమిషన్కు విశేష అధికారాలు ఉంటాయని, ఎన్నికలు ఎలా నిర్వహించాలో ఎన్నికల సంఘం చూసుకుంటుందని, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు పేర్కొంది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తామని పిటిషనర్ చెప్పారు. ఇప్పుడు శశాంక్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు.