సస్పెన్షన్ ఎందుకు ఎత్తివేయలేదంటే..: రోహిత్ ఆత్మహత్యపై వైస్ ఛాన్స్లర్
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్ అంశంపై వైస్ ఛాన్సులర్ అప్పారావు ఓ టీవీ చానల్తో మాట్లాడారు. రోహిత్ తదితరుల పైన సస్పెన్షన్ ఎత్తివేయక పోవడానికి గల కారణాన్ని వివరించారు. ఇదే విషయాన్ని విద్యార్థులకు చెప్పానన్నారు.
రోహిత్ ఆత్మహత్య చేసుకున్న విషయం సాయంత్రం తెలిసిందని, తాను దిగ్భ్రాంతికి గురయ్యానని వీసీ చెప్పారు. తన పైన ఆరోపణలు రావడాన్ని ఆయన ఖండించారు. వీసీగా తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. పద్ధతి ప్రకారమే వెళ్లామన్నారు.
విద్యార్థుల పైన సస్పెన్షన్ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు తాను ప్రయత్నాలు చేశానని చెప్పారు. ఈ విషయమై సీనియర్ ఫ్యాకల్టీతోను చర్చించానని, కేసును తగ్గించే ప్రయత్నం చేశానన్నారు. విద్యార్థులతోను రెండు గంటల పాటు మాట్లాడానని చెప్పారు.

విద్యార్థుల సస్పెన్షన్ ఎత్తివేత అంశం కోర్టు పరిధిలో ఉందని, ఆ విషయమే తాను విద్యార్థులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశానని, కోర్టు పరిధిలో ఉన్నప్పుడు తాము సస్పెన్షన్ ఎత్తివేయలేమన్నారు. రేపు కోర్టులో హియరింగ్కు వచ్చాక సస్పెన్షన్ ఎత్తివేసే విషయమై ఆలోచించుతామని చెప్పామన్నారు.
విద్యార్థుల సస్పెన్షన్ ఎత్తివేత పైన తనకు పూర్తి అధికారాలు ఉండవని చెప్పారు. అందరు కలిసి తీసుకున్న నిర్ణయమన్నారు. నేను అప్పారావుగా, కేవలం వీసీగా అన్నీ చేయలేనని చెప్పారు. కేసులో నేను నిష్పక్షపాతంగా వ్యవహరించానన్నారు. అలాగే తమ పైన ఎలాంటి ఒత్తిళ్లు లేవని చెప్పారు. రోహిత్కు నేను పాఠాలు చెప్పానని, అతను మంచి విద్యార్థి అన్నారు.












Click it and Unblock the Notifications