బెజవాడ కోర్టుకు కాల్ లిస్ట్, ఏముందో చెప్పలేం!: వాయిస్ టెస్ట్లో ఎసిబి ట్విస్ట్
హైదరాబాద్/విజయవాడ: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాల్ డేటాను విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు ఇచ్చేందుకు సర్వీస్ ప్రొవైడర్లు న్యాయస్థానానికి శుక్రవారం ఉదయం చేరుకున్నారు. వారు ప్రత్యేక సీల్డ్ కవర్లో కాల్ డేటా వివరాలను కోర్టుకు అందజేశారు.
కాల్ డేటాను సీల్డు కవర్లో అందజేసిన ప్రొవైడర్లు అందులో ఏముందో చెప్పేందుకు నిరాకరించారు. సీల్డు కవర్లో ఏముందో తెలియజేస్తూ నోట్ ఫైల్ ఇవ్వాలని సీఐడీ, సిట్ న్యాయవాదులు చెప్పగా, తాము సుప్రీం సూచన మేరకు సీల్డు కవర్లో అందించామని ప్రొవైడర్లుచెప్పారు. దానిలో ఏముందో చెప్పమని తెలిపారు.
కాల్ డేటా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అడిగే హక్కు లేదని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు ఎక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
కాల్ డేటాను విజయవాడ కోర్టుకు ఇవ్వాలని, అయితే దానిని తాము ఆదేశాలు ఇచ్చే వరకు తెరవవద్దని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కాల్ డేటా ఇచ్చేందుకు సర్వీస్ ప్రొవైడర్లు కోర్టుకు వచ్చారు.
ఓటుకు నోటు కేసు నిందితులపై ఎసిబి నిఘా
ఓటుకు నోటు కేసు నిందితుల పైన ఎసిబి నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. వారి కదలికల పైన ఆరా తీస్తోంది. మీడియాతో వారు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం.
నిందితులు, విచారణ ఎదుర్కొన్న 13 మంది పైన నిఘా పెట్టారని సమాచారం. ఎక్కడైన రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారా అన్న అంశాలను తరచి చూస్తోందని తెలుస్తోంది. శుక్రవారం మరో ఇద్దరికి నోటీసులు జారీ చేయవచ్చునని సమాచారం.
ఇదిలా ఉండగా, ఓటుకు నోటు కేసులో ఏసీబీ రూటు మార్చింది! రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యల స్వర నమూనాలను అందజేయాలని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి లేఖ రాసింది. అలాగే, ఇతర నిందితులు సెబాస్టియన్, మత్తయ్యల స్వర నమూనాలను ఇవ్వాలని మూడు టీవీ ఛానళ్లకు కోర్టు ద్వారా నోటీసులు ఇచ్చింది.
ఈ కేసులో నిందితులు స్వర పరీక్షకు సహకరించకపోవచ్చని ఏసీబీ భావిస్తోంది. నిందితులు సహకరించకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని, కేసు మొత్తం తలకిందులౌతుందని ఎసిబి భావిస్తోంది. ముందస్తుగానే వారి స్వరనమూనాలను సేకరించి, అడ్మిటెడ్ స్వరాన్ని వాడుకోవాలని నిర్ణయించింది.