ఒక్క రోజే హైదరాబాదులో 11 చోట్ల చైన్ స్నాచర్లు ఇలా (ఫొటో)
హైదరాబాద్: హైదరాబాదు నగరంలో చైన్ స్నాచర్లు మంగళవారం ఒక్కరోజే వరుసగా సంఘటనలతో రెచ్చిపోయారు. ఒకేరోజు 11 ప్రాంతాల్లో స్నాచింగ్లకు పాల్పడ్డారు. ద్విచక్ర వాహనాలపై వచ్చి ఒంటిరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యం చేసుకుని వారి మెడలోంచి బంగారు గొలుసులను అపహరించారు. మొత్తం 38.5 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఫిలింనగర్ బాధితురాలు మాజీ మంత్రి సోదరి
జూబ్లీహిల్స్ రోడ్ నెం.72లోని ప్రశాసన్నగర్లో నివాసం ఉంటున్న మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు సోదరి కె.సత్యవతి(76) ఉదయం 6 గంటలకు ఫిలింనగర్ దైవ సన్నిధానంలో పూజలు నిర్వహించేందుకు వచ్చారు. పూజలు ముగించుకుని ఉదయం 9 గంటలకు రోడ్డుపైకి వచ్చి కారు కోసం వేచిచూస్తున్నారు. అదే సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలోంచి 2 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు.
రెండు నిమిషాల వ్యవధిలోనే..
ఆ తర్వాత అక్కడికి కొంచెం కింది భాగంలో ఉన్న బ్రిలియంట్ స్కూల్లో పిల్లలను వదిలేందుకు వచ్చిన ఫిలింనగర్ భగత్సింగ్నగర్ బస్తీకి చెందిన మల్లీశ్వరి(30) మెడలోంచి 2 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. రెండు నిమిషాల వ్యవధిలో ఈ రెండు సంఘటనలు జరిగాయి. సీసీ పుటేజీని పోలీసులు పరిశీలించారు. ఇద్దరు యువకులు చైన్స్నాచింగ్ చేసినట్లు గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
సేవక్నగర్లో ఇలా..
నాంపల్లి ప్రాంతంలోని సేవక్నగర్లో నివాసం ఉంటున్న సరోజిని(60) ఉదయం ఎనిమిది గంటల సమయంలో బయటకు వెళ్లి పాల ప్యాకెట్ తీసుకొని, తిరిగి ఇంటి ముందుకు చేరుకుంది. అదే సమయంలో బైక్పై తలకు హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి వేగంగా వచ్చి ఆమె మెడలోని మూడు తులాల బంగారు తాడును లాగారు. దీంతో సరోజిని ఏం జరిగిందని తేరుకునేలోపే దుండగులు బైక్పై పలాయనం చిత్తగించారు.
కెబిహెచ్ కాలనీలో..
కేపీహెచ్బీకాలనీ పోలీస్స్టేషన్ పరిధిలో చైన్స్నాచర్లు స్వల్ప వ్యవధిలోనే రెండు ప్రాంతాల్లో బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. కేపీహెచ్బీకాలనీ రైతుబజారు సమీపంలోని ధర్మారెడ్డికాలనీ ఎంఐజీ-90లో నివాసం ఉంటున్న పట్నం జలజ(51) ఉ. 8.45 గంటలకు రైతుబజారుకు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేసి, తిరిగి ఇంటికి వస్తోంది. ఈ క్రమంలో నల్లటి బైక్పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలోని రెండు తులాల నల్లపూసల తాడును లాక్కొని పరారయ్యారు.
కేపీహెచ్బీకాలనీ 1, 2వ ఫేజ్లోని ప్రతిభ స్కూల్ సమీపంలో నివసిస్తున్న టీహెచ్ఎన్ మల్లేశ్వరి(56) ఉదయం 8.50 గంటల సమయంలో తన మనవరాలును ప్రతిభ స్కూల్ వద్ద వదిలి వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో మల్లేశ్వరికి ఎదురుగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలోని రెండు తులాల బంగారు పుస్తెలతాడును అపహరించుకుపోయారు.
సనత్నగర్లో ఇలా..
అమీర్పేట పోలీసు స్టేషన్ పరిధిలోని జెక్కాలనీ వాసవి ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 308లో నివాసం ఉంటున్న సువర్చల ఉదయం 9 గంటలకు కాలనీలోని స్ట్రీట్ నెంబర్-1లో కూరగాయలు కొనుగోలు చేసుకుని ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలో వెనుక నుంచి పల్సర్ బైక్పై వచ్చిన దుండగులు ఆమె మెడలో నుంచి నల్లగొలు సు, మంగళసూత్రాన్ని తెంపుకుని పారిపోయారు. ఈ ఘనటలో 7 తులాల బంగారం లాక్కున్న ఆగంతకులు ఎర్రగడ్డ చౌరస్తా వైపు పారిపోయారని బాధితురాలు తెలిపారు.