పక్షులకు ఉరిపెడుతున్న చైనా మాంజా పట్టివేత (పిక్చర్స్)
హైదరాబాద్: సంక్రాంతి పర్వదినం సందర్భంగా పతంగులను ఎగురవేయడానికి ప్రత్యేకమైన దారాన్ని వాడే విషయం అందరికీ తెలిసిందే. దాన్నే చైనా మాంజా అంటారు. అయితే, ఆ మాంజా పక్షుల ప్రాణాలను తీస్తోందని అటవీ శాఖ అధికారులు అంటున్నారు.
ఆ దారాన్ని నిషేధించాలని వారు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చైనా మాంజా బదులు దేశవాళీ మాంజాతో పతంగులను ఎగురేయాలని తెలంగాణ అటవీ శాఖ ముఖ్య సంరక్షణాధికారి పికె శర్మ సూచించారు.
నైలాన్ దారానికి గ్లాస్ పౌడర్ కోటింగ్ ఇచ్చి దాన్ని తయారు చేస్తారని, ఈ చైనా మాంజాతో ప్రమాదమని ఆయన అన్నారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ సొసైటీ, పీపుల్ ఫర్ ఎనిమల్స్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి ఆయన సోమవారం అరణ్యభవన్లో పికె శర్మ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

చిన్న పిల్లలు సైతం
పతంగులను ఎగురేసే సమయంలో చిన్నపిల్లలు, వాహనచోదకులు కూడా చైనా మాంజా కారణంగా గాయపడుతున్నారని పికె శర్మ అన్నారు.

పక్షులకు గాయాలు..
చెట్లకు, విద్యుత్తు స్తంభాలకు పతంగులతో పాటు చిక్కిన చైనా మాంజా బారిన పడి పక్షులు తీవ్రంగా గాయపడి మరణించిన సంఘటనలు చాలా ఉన్నాయని శర్మ చెప్పారు.

గూటికి చేరే సమయంలో...
పక్షులు గూళ్లకు చేరే సాయంత్రం వేళల్లో పతంగులను ఎగురవేయవద్దని, చైనా మాంజాను తెంచే సమయంలో పిల్లల చేతులకు, నోళ్లకు గాయాలవుతున్నాయని శర్మ చెప్పారు.

రాజస్థాన్లో అభ్యంతరం
అంతర్జాతీయ పతంగుల పండుగ జరిగే రాజస్థాన్లో చైనా మాంజా వాడకంపై అక్కడి హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపిందని శర్మ చెప్పారు.

అవగాహన కల్పిస్తాం...
చైనా మాంజా వాడకం వల్ల కలిగే ప్రమాదంపై సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తామని శర్మ చెప్పారు. చైనా మాంజా అమ్మకాలను నియంత్రించాలని కలెక్టర్లను, ఎస్పీలను కోరినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications