హాంగ్కాంగ్ పారిశ్రామికవేత్తలకు కెసిఆర్ ఆహ్వానం (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంగళవారంనాడు హాంగ్కాంగ్ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. పారిశ్రామికాభివృద్ధికి తమ రాష్ట్రం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. తమ రాష్ట్రానికి రావాలని, కలిసి పనిచేద్దామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న సానుకూల అంశాలను కెసిఆర్ వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా వినూత్నంగా తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానం (టీఎస్ఐపాస్) గురించి వివరించారు. పారిశ్రామిక అనుమతుల కోసం గ్రిల్స్లేని సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.
నిర్దిష్ట కాలపరిమితిలో అనుమతులు జారీ చేసే ప్రక్రియను సవివరంగా తెలియజేశారు. హాంకాంగ్లోని రినైస్సెన్స్ హార్బర్ వ్యూ హోటల్లో జరిగిన ఈ సెమినార్లో తెలంగాణపై ఐదు నిమిషాల వ్యవధితోకూడిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. హాజరైన పారిశ్రామికవేత్తలు ఆసక్తిగా దానిని తిలకించారు.

సందేహాలను నివృత్తి చేసుకున్న పారిశ్రామికవేత్తలు
టీఎస్ఐపాస్కు ఆకర్షితులైన పారిశ్రామికవేత్తలు దానిపై తమకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. తొలుత సమావేశానికి హాజరైన ప్రతినిధులకు హాంకాంగ్లో భారత కాన్సుల్ జనరల్ ప్రశాంత్ అగర్వాల్ స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రంపై అవగాహన కలిగించేలా డాక్యుమెంటరీని ప్రదర్శించారు.

పారిశ్రామిక విధానంపై వివరణ
తెలంగాణలో వ్యాపార అవకాశాలు, నూతన పారిశ్రామిక విధానం గురించి రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి అర్వింద్కుమార్ వివరించారు. సెమినార్లో భాగంగా సమావేశంలో పాల్గొన్న వివిధ కంపెనీల ప్రతినిధులతో ప్రశ్నలు, జవాబు కార్యక్రమాన్ని నిర్వహించి వారికున్న సందేహాలను నివృత్తి చేశారు.

కలిసి భోజనం
హాంకాంగ్లో ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అరుణాచలం ముగింపు వాక్యాలు పలికారు. సెమినార్కు వచ్చిన ప్రతినిధులు, కాన్సులేట్ జనరల్, సీఎం కలిసి భోజనం చేశారు.

భారీ బుద్ధ విగ్రహం సందర్శన..
సెమినార్ ముగిసిన తరువాత సీఎం కేసీఆర్, ప్రతినిధుల బృందం, భారత కాన్సులేట్ జనరల్ ప్రశాంత్ అగర్వాల్తో కలిసి లాంతౌ ద్వీపం న్యాంగ్పింగ్ ప్రాంతంలోని టియాన్టన్ భారీ కంచు బుద్ధ విగ్రహాన్ని సందర్శించారు.

బుద్ధ విగ్రహ నిర్మాణం ఇలా..
కంచు బుద్ధ విగ్రహాని 1990లో నిర్మించడం ప్రారంభించి, 1993 డిసెంబర్ 29న పూర్తిచేశారు. చైనా సంప్రదాయం ప్రకారం బుద్ధుడు జ్ఞానోదయం పొందిన రోజు అదే. 112 అడుగుల పొడవు, 250 మెట్రిక్ టన్నుల బరువు ఉన్న ఈ విగ్రహాన్ని 202 కంచు ముక్కలతో తయారుచేశారు.

ముగిసిన చైనా పర్యటన
ముఖ్యమంత్రి కేసీఆర్ బృందం పది రోజుల చైనా పర్యటనను ముగించుకుని బుధవారం సాయంత్రం హైదరాబాద్కు చేరుకోనుంది.

తొమ్మిది రోజుల పాటు..
ఈనెల 7న ఉదయం ప్రత్యేక విమానంలో చైనాకు వెళ్ళిన కేసీఆర్ తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, నూతన పారిశ్రామిక విధానాన్ని చాటి చెప్పడంతోపాటు, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ప్రసంగించారు.












Click it and Unblock the Notifications