కళ్ల ముందే: కిందపడిపోతున్న పైలట్, ఆదుకునేందుకు పరుగులెట్టిన ప్రజలు..
ఛండీగఢ్ కు చెందిన రేశ్నా రహ్నీ అనే మహిళా క్యాడెట్ హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఐఏఎఫ్ కిరణ్ ఎయిర్ క్రాప్ట్ లో టేకాఫ్ అయ్యారు. కాసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతోపాటు నిప్పురవ్వ
హైదరాబాద్: కళ్లముందే ఆకాశంలో ఓ ఎయిర్ క్రాఫ్ట్ పేలిపోవడం.. అందులోంచి పారాచ్యూట్తో దూకిన పైలట్ వేగంగా వచ్చి భూమిపై పడడం గమనించిన స్థానికులు ఊరుకులు పరుగులుపెట్టి పైలట్ వద్దకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించిన ఉదంతమిది.
వివరాల్లోకి వెళితే... ఛండీగఢ్ కు చెందిన రేశ్నా రహ్నీ అనే మహిళా క్యాడెట్ హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఐఏఎఫ్ కిరణ్ ఎయిర్ క్రాప్ట్ లో టేకాఫ్ అయ్యారు. కాసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతోపాటు నిప్పురవ్వలు ఎగిశాయి.
వాటిని సరిదిద్దే క్రమంలో ప్రమాదం జరగబోతోందని ఆమె ముందే గుర్తించి వెంటనే పారాచ్యూట్ సాయంతో విమానం నుంచి కిందికి దూకేశారు. ఆమె అలా దూకిందో లేదో ఆ వెంటనే విమానం గాల్లోనే పేలిపోయింది.
ఈ పేలుడు వల్ల విమాన శకలాలు సిద్దిపేట జిల్లా దుద్దెడలోని ఓ రైతు పొలంలోని నీలగిరితోటలో పడ్డాయి. ఆ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి దూకేసిన మహిళా పైలట్ రేశ్నా రాహ్నీ పారాచ్యూట్ సహా అక్కడికి దగ్గర్లోని రాజీవ్ రహదారిపై పడ్డారు.
ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడికి దగ్గర్లోని ఫంక్షన్ హాల్ లో ఓ వివాహం జరుగుతోంది. దీనికి హాజరైన వారంతా ఈ దుర్ఘటనను కళ్లారా చూశారు. విమానం గాల్లోనే పేలిపోవడం, పైలట్ పారాచ్యూట్ తో కిందపడడం గమనించి సహాయం చేసేందుకు పరుగులు పెట్టారు.
రోడ్డు మీద పడి ఒక కాలు, చేయి విరిగిన స్థితిలో ఉన్న మహిళా పైలట్ ను జాగ్రత్తగా పైకి లేపి కూర్చోబెట్టారు. మంచి నీళ్లు ఇచ్చి ఉపశమనం కలిగేలా చేశారు. అంబులెన్స్ లో ఆమెను సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే హకీంపేట శిక్షణ క్యాంపు నుంచి రెండు హెలికాప్టర్లు బయల్దేరి రాగా, మెరుగైన చికిత్స కోసం ఒక దానిలో ఆమెను హకీంపేటలోని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన జరిగిన సమయంలో ఆ విమాన శకలాలు ఇటు వివాహం జరుగుతున్న ఫంక్షన్ హాల్ పై పడినా అటు రాజీవ్ రహదారిపై పడినా పెద్ద ప్రమాదం సంభవించి ఉండేదని దుద్దెడ వాసులు తెలిపారు.