నేడు ఈడీ ముందుకు పైలట్ రోహిత్ రెడ్డి.. ఆ ఆస్తుల వివరాలతో; అందరిలో ఉత్కంఠ!!
తెలంగాణ రాష్ట్రంలో పైలట్ రోహిత్ రెడ్డికి, బిజెపి నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడి నోటీసులు వచ్చిన క్రమంలో తెలంగాణలో మొదలైన రగడ చిలికి చిలికి గాలివానగా మారుతోంది. తన బ్యాంకు ఖాతాల వివరాలతో ఈడీ విచారణకు హాజరుకావాలని పైలెట్ రోహిత్ రెడ్డి కి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసిన క్రమంలో నేడు పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరు కానున్నారు.

నేడు ఈడీ విచారణకు పైలట్ రోహిత్ రెడ్డి
ఈరోజు ఉదయం పదిన్నర గంటలకు ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. తన బ్యాంకు ఖాతాల వివరాలతో ఆయన ఈడీ విచారణకు హాజరు కానున్నారు. అయితే 2015 ఏప్రిల్ నుంచి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కుటుంబ ఆస్తుల వివరాలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అడిగింది. ఇక అన్ని అంశాలపై పూర్తి వివరాలతో విచారణకు రావాలని ఈ డి తన నోటీసులో పేర్కొంది. ఎన్నికల అఫిడవిట్లో విద్యార్హతలపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్హత పత్రాలను కూడా విచారణకు తీసుకురావాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులో పేర్కొంది. విచారణకు హాజరవుతున్న క్రమంలో పైలట్ రోహిత్ రెడ్డి పై ఈడీ అధికారుల విచారణ ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

ఈడీ నోటీసులతో బెంగుళూరు డ్రగ్స్ కేసుపై రగడ
ఇదిలా ఉంటే బెంగళూరు డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి హస్తం ఉందని, పైలట్ రోహిత్ రెడ్డిని ఈ డి, సి.బి.ఐ అధికారులు దర్యాప్తు చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సంగ్రామ పాదయాత్రలో సంచలన వ్యాఖ్యలు చేసిన రెండు రోజుల తర్వాత ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పైలట్ రోహిత్ రెడ్డి కి నోటీసులు జారీ చేసింది. అయితే బెంగళూరు డ్రగ్స్ కేసులోనే పైలట్ రోహిత్ రెడ్డికి నోటీసులు వచ్చాయని బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలను ఖండించిన పైలట్ రోహిత్ రెడ్డి తనకు బెంగళూరు డ్రగ్స్ కేసులో ఎటువంటి నోటీసులు రాలేదని, తన ఆస్తుల వివరాలను అడుగుతూ ఈడీ నోటీసులు ఇచ్చిందని, తన బయోడేటాను మాత్రమే ఈడీ కోరిందని పేర్కొన్నారు.

పైలట్ రోహిత్ రెడ్డి బండి సంజయ్ లమధ్య మాటల యుద్ధం .. సవాళ్లు
అంతేకాదు బెంగళూరు డ్రగ్స్ కేసు ఈ విషయంలో తనకు నోటీసులు వస్తే చూపించాలని బండి సంజయ్ కు సవాల్ విసిరిన ఆయన భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి బండి సంజయ్ తనపై చేసిన వ్యాఖ్యలను నిరూపించాలన్నారు. ఇక పైలట్ రోహిత్ రెడ్డి చేసిన సవాలును స్వీకరించనని బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడంతో తన సవాల్ ను బండి సంజయ్ ఎందుకు స్వీకరించ లేదని పైలట్ రోహిత్ రెడ్డి ఎద్దేవా చేశారు. బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణలు తప్పని ప్రజలకు కూడా అర్థమైంది అన్నారు.

రఘునందన్ రావుకు పైలట్ రోహిత్ రెడ్డి సవాల్
బిజెపి నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని పైలట్ రోహిత్ రెడ్డి విమర్శించారు. మతం పేరుతో రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అదే సమయంలో ఎన్నికల అఫిడవిట్లో తాను తప్పుడు పత్రాలు సమర్పించినట్లు రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలపై పైలట్ రోహిత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని సవాల్ విసిరారు. రఘునందన్ వ్యాఖ్యలు నిజమని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. నిరూపించ లేకపోతే రఘునందన్ తన పదవికి రాజీనామా చేయాలని పైలట్ రోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications