ప్రజాసంగ్రామ యాత్ర - బీజేపీకి వ్యతిరేకంగా పోస్టర్లు : 20 ప్రశ్నలతో..!!
తెలంగాణలో టీఆర్ఎస్ వర్సస్ బీజీపీ పోరు తీవ్రమవుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్ర వేళ.. కొత్త రాజకీయం మొదలైంది. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా పోస్టర్లు దర్శనమిచ్చాయి. కంటోన్మెంట్ యూత్ పేరుతో కేంద్ర ప్రభుత్వాన్ని..బీజేపీని ప్రశ్నిస్తూ ఈ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేశారో చెప్పాలంటూ 20 ప్రశ్నలతో కూడిన పోస్టర్లను కంటోన్మెంట్ యువత పేరుతో చెక్పోస్ట్ వద్ద ఉన్న ప్రహరీలపై అంటించారు. ప్రజా సంగ్రామ యాత్ర పోస్టర్ల పక్కనే మోదీ సమాధానం చెప్పాలంటూ... పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ఆ పోస్టర్లలో తెలంగాణకు సంబంధించిన అంశాలతో 20 ప్రశ్నలు ప్రింట్ చేసారు.
కేంద్రం తెలంగాణకు ఇచ్చిన హామీలు..అమలు కాలని పెండింగ్ అంశాలను ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు. తెలంగాణకు దక్కాల్సిన ఐటీఐఆర్, మెడికల్ కళాశాలల గురించి కేంద్రాన్ని ఈ పోస్టర్ల ద్వారా ప్రశ్నించారు. వీటితో పాటుగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ..జాతీయ విద్యా సంస్థల ఏర్పాటు, కంటోన్మెంట్ ఎన్నికల అంశం, బయ్యారం గనుల గురించీ ప్రశ్నలు సంధించారు.
పసుపు బోర్డు, కంటోన్మెంట్లో ఓటర్ల తొలగింపు, కంటోన్మెంట్ రహదారులు మూసివేత, ప్రాజెక్టులకు జాతీయ హోదా గురించి ప్రశ్నించారు. ఈ అంశాలను వెంటనే ప్రజలకు అందించి..కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దిని చాటుకోవాలని పోస్టర్ల ద్వారా డిమాండ్ చేసారు.
పాదయాత్రల పేరుతో ప్రజాసమస్యలు తీరవని తెలంగాణ ప్రభుత్వం ప్రజా సమస్యలు తీర్చేందుకేనని పోస్టర్ పైన స్లోగన్లు దర్శనమిస్తున్నాయి. అదే విధంగా.. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేసారు. అయితే, వీటిని ఎవరు ఏర్పాటు చేసారనేది మాత్రం స్పష్టత రాలేదు. బండి సంజయ్ పాదయాత్ర సమయంలో ఈ పోస్టర్లు రాజకీయ చర్చకు కారణమవుతున్నాయి.