ప్రపంచ గుర్తింపు: పాలమూరు మేస్త్రీకి ప్రధాని మోడీ ప్రశంస
న్యూఢిల్లీ: ప్రపంచ నైపుణ్య సదస్సులో ఇటుకలు పేర్చడంలో ప్రతిభ కనబర్చిన తెలంగాణ యువకుడు పరుశురామ్ నాయక్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. స్కిల్ ఇండియా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పరుశురాంకు మోడీ ప్రశంసాపత్రం ఇచ్చారు.
వలస కూలీలకు పేరొందిన పాలమూరు జిల్లాకు చెందిన వాడు పరుశురాం నాయక్. ఇతను తాపీ మేస్త్రీ. ప్రపంచ గుర్తింపును సంపాదించాడు. గత ఏప్రిల్లో న్యూజిలాండ్లో జరిగిన ప్రపంచ నైపుణ్యాభివృద్ధి సదస్సులో భారత్ తరఫున కాంస్య పతకం సాధించాడు.
అతనిని ప్రధాని మోడీ స్కిల్ డెవలప్మెంట్ అవార్డుతో సత్కరించారు. వచ్చే నెలలో బ్రెజిల్లో జరిగే పోటీల్లో కూడా పరుశురాం పాల్గొననున్నాడు. పదో తరగతిలో చదువు మానేశాడు.
పొట్ట చేత పట్టుకొని మహారాష్ట్రలోని పుణే చేరిన అతడు తాపీ మేస్త్రీగా పని చేస్తూనే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఇటుకలను పేర్చే పనిలో ప్రత్యేక శిక్షణ పొందాడు. క్రెడాయ్ సంస్థలో కూడా శిక్షణ తీసుకున్నాడు. ఏప్రిల్ 13 నుంచి 17 వరకు న్యూజిలాండ్లో జరిగిన వరల్డ్ స్కిల్స్ పోటీల్లో మనదేశం తరఫున పాల్గొని కాంస్యం సాధించాడు. ఇతని వయస్సు 19 ఏళ్లు.