నకిలీ గోరక్షకులారా! ఖబడ్దార్, యుగయుగాలుగా దళితులకు కష్టాలా: మోడీ
గజ్వెల్: గోసంరక్షణ పేరుతో భారతీయ సమాజాన్ని చీల్చేందుకు కొందరు నకిలీ గోరక్షకులు కుట్ర పన్నుతున్నారని, నకిలీ వారి పట్ల అసలైన గోరక్షకులు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు మెదక్ జిల్లా గజ్వెల్ బహిరంగ సభలో హెచ్చరించారు.
గోరక్షణ పేరుతో కొందరు నకిలీ వారు చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. అందుకే గోరక్షణ పేరుతో అసాంఘీక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారన్నారు. వారి పట్ల అందరూ, అసలైన గోరక్షకులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
నకిలీ గోరక్షకుల పైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే నకిలీలల వల్ల అందరికీ చెడ్డపేరు వస్తుందన్నారు. నకిలీ గోరక్షకులను సమాజం నుంచి వెలివేయాలన్నారు. గోరక్ష పేరుతో జరుగుతోన్న దాడులు సరికాదని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆవులు ఉంటే మన సంపద పెరిగినట్లే అన్నారు. ఆవును వ్యవసాయంతో అనుసంధానం చేయాలన్నారు. నకిలీ గోరక్షకులను నేను హెచ్చరిస్తున్నానని, మీ ఆటలు కట్టిపెట్టాలని, ఘర్షణ వాతావరణం సృష్టించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నానన్నారు.
కాగా, ప్రధాని మోడీ గోరక్ష వ్యాఖ్యల పైన కాంగ్రెస్, సిపిఎం స్పందించాయి. దళిత ఓటు బ్యాంకును కాపాడుకునేందుకే మోడీ గోరక్షకుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సీపీఎం పేర్కొంది. గోరక్ష పేరుతో జరుగుతోన్న దాడులపై మోడీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ, సంఘ వ్యతిరేక శక్తులపై కఠినంగా ఎందుకు వ్యవహరించడం లేదని ప్రశ్నించారు.
మోడీ తన సొంత రాష్ట్రంలో మునిగిపోతున్న బీజేపీ నావను కాపాడుకోవాలనే ఇటువంటి వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు. ప్రధాని రాజకీయ ప్రయోజనాల దృష్ట్యానే గోరక్షకులపై మండిపడ్డారన్నారు. గుజరాత్లో బీజేపీ అధికారం నుంచి పోయే పరిస్థితి నెలకొంది కాబట్టే ఇలా స్పందించారన్నారు.
ఇంకా అస్పృశ్యత సిగ్గుచేటు: మోడీ
అస్పృశ్యత ఇంకా సిగ్గుచేటు అని ప్రధాని మోడీ అన్నారు. ఆదివారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఇంకా దళితులపై దాడులు జరగడమంటే మానవత్వానికి మాయని మచ్చ అన్నారు.
ఈ ఆధునిక కాలంలో ఇంసా సృశ్యులు, అస్పృశ్యులు అనడం బాధాకరమన్నారు. దళిత, పీడిత, బాధితులందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు. యుగయుగాలుగా దళిత సోదరులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని చెప్పారు.