ఇక ఆ రెండు ప్రధాన రైళ్లు చర్లపల్లి నుంచే - నేడే ప్రారంభం..!!
రైల్వే ప్రయాణీకులకు కొత్తగా మరో రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తోంది. రూ.413 కోట్లతో కొత్తగా నిర్మించిన చర్లపల్లి టెర్మినల్ను సోమవారం ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ వర్చువల్ గా ఈ టెర్మినల్ ను ప్రారంభించనున్నారు. ఈ స్టేషన్ నుంచి ఇప్పటికే ప్రకటించిన రైళ్లతో పాటుగా కొత్తగా మరో ప్రధాన రైళ్లను నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. పూర్తిగా అధునాతన సౌకర్యాలతో ఈ టెర్మినల్ ను సిద్దం చేసారు.
నేడే ప్రారంభం
చర్లపల్లి రైల్వే స్టేషన్ లో నేటి నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. దీంతో నాంపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గనుంది. అంతర్జాతీయ విమానా శ్రయ తరహాలో చర్లపల్లి రైల్వే టర్మినల్ను అభివృద్ధి చేశారు. ఈ స్టేషన్ నుంచి 24 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఐదు లిఫ్టులతోపాటు, ఐదు ఎస్కలేటర్లను సైతం ప్లాట్ఫామ్స్లో ఏర్పాటు చేశారు. అలాగే పార్సిల్ బుకింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించారు. 25 జతల రైళ్లను హ్యాండిల్ చేసేలా ఈ స్టేషన్లో ట్రాకులు ఏర్పాటు చేశారు. అందుకోసం 10 కొత్త ట్రాకులను నిర్మించారు.

ఆ రెండు ఎక్స్ప్రెస్ లు ఇక్కడే
మరోవైపు ఈ స్టేషన్లో మొత్తం మూడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయి. గతంలో ఒకటి ఉండగా.. నూతనంగా రెండు టర్మినల్స్ను నిర్మించారు. దేశంలో మారుతోన్న పరిస్థితులను అనుగుణంగా.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోని.. ఈ టెర్మినల్ను రైల్వే శాఖ రూపొందించింది. ఈ టెర్మినల్ అందుబాటులోకి రావటంతో మరో రెండు ప్రధాన రైళ్ల రాకపోకలను ఇక్కడి నుంచే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ప్రతీ రోజు నాంపల్లి నుంచి బయల్దేరే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-హైదరాబాద్ ఎక్స్ప్రెస్- చెన్నై ఎక్స్ప్రెస్ ఇక నుంచి ప్రస్తుతం నడుస్తున్న సమయానికే చర్లపల్లి నుంచి బయల్దేరనుంది. అదే విధంగా గోరఖ్పూర్-సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ సైతం చర్లపల్లి నుంచి నిర్వహించనున్నారు.
ప్రధాన రైళ్లకు కేంద్రంగా
కొన్ని రైళ్లకు తాజాగా చర్లపల్లి స్టేషన్ లోనూ స్టాపింగ్ కల్పించారు. గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ లు ఇక్కడ ఆగనున్నాయి. ఇక, సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో 52 అదనపు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్, చర్లపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడ, తిరుపతి, నర్సాపూర్, శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఆయా ప్రాంతాలకు 6 నుంచి 18వ తేదీ వరకు ఈ ట్రైన్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.












Click it and Unblock the Notifications