సీఎం కేసీఆర్ను అవమానించినట్లు కాదా?: ప్రధాని మోడీ పర్యటనలపై కేటీఆర్ ఫైర్, గవర్నర్పైనా
హైదరాబాద్: ఫిబ్రవరిలో రామానుజాచార్యుల సమానత్వ విగ్రహం ప్రారంభోత్సవానికి తన తండ్రి గైర్హాజరు కావడంపై వచ్చిన విమర్శలపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనయుడు, ఐటీ మంత్రి కేటీ రామారావు తాజాగా స్పందించారు. జాతీయ మీడియా ఎన్డీటీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ.. సంచలన విషయాలను వెల్లడించారు.
సీఎం కేసీఆర్ను అవమానించినట్లు కాదా?: ప్రధాని పర్యటనలపై కేటీఆర్
ప్రధాని నరేంద్ర మోడీ సమానత్వ విగ్రహం ప్రారంభోత్సవం కోసం హైదరాబాద్కు వచ్చినప్పుడు స్వాగతించడానికి, వ్యక్తిగతంగా ఆతిథ్యం ఇవ్వడానికి కేసీఆర్ రాలేదని.. దీంతో చాలా మంది ఇది ప్రోటోకాల్ స్పష్టమైన ఉల్లంఘన అని అన్నారని కేటీఆర్ తెలిపారు. అయితే, గత ఏడాది నవంబర్లో భారత్ బయోటెక్ కోవిడ్ వ్యాక్సిన్ సదుపాయాన్ని సందర్శించడానికి ప్రధాని మోడీ వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి కనిపించలేదు. ఎందుకంటే.. ఈ రెండు సందర్భాల్లోనూ ముఖ్యమంత్రి 'రావద్దు' అని ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టమైన సందేశం పంపిందని కెటి రామారావు చెప్పారు. '' ఇదంతా పీఎంఓ ప్రొటోకాల్ ఉల్లంఘనలు కాదా, ఓ ముఖ్యమంత్రిని ప్రధాని అవమానించడం కాదా?'' అని కేటీఆర్ ప్రశ్నించారు.
గవర్నర్ బీజేపీ నేతలా వ్యవహరిస్తున్నారంటూ కేటీఆర్ విమర్శలు
గవర్నర్ జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు ప్రోటోకాల్లు ఎందుకు పాటించలేదని అడిగిన ప్రశ్నకు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. గవర్నర్ బీజేపీ నేతలా ప్రవర్తిస్తారు. ఆమె కౌన్సిల్ ఆమోదించని గణతంత్ర దినోత్సవ ప్రసంగాన్ని చదివారు. మంత్రులపై ఆమె రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు అని అన్నారు కేటీఆర్. ఏప్రిల్ నెల ప్రారంభంలో, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గిరిజన పండుగకు హాజరై యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు, అయితే ప్రోటోకాల్ ప్రకారం ఆమెను స్వీకరించడానికి మంత్రి, ఎమ్మెల్యే లేదా అధికారులెవరూ రాలేదు. ఇటీవల ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి తనను అవమానించారని.. గవర్నర్ ఫిర్యాదు చేశారు. సీఎం తన ఆహ్వానాలను పలుమార్లు తిరస్కరించారని, ప్రోటోకాల్ను ఉల్లంఘించారని ఆరోపించారు.
సీఎం, మంత్రులను పీఎం, కేంద్రమంత్రులే అవమానిస్తున్నారంటూ కేటీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రిని, ఆయన మంత్రులను అవమానించేది.. కేంద్ర మంత్రులతో పాటు ప్రధానమంత్రి కూడా అని రామారావు అన్నారు. "మేము వరి సేకరణ వంటి తీవ్రమైన సమస్యలను లేవనెత్తినప్పుడు పీయూష్ గోయల్ ఎగతాళి చేశారు," అని కేటీఆర్ తెలిపారు. "మేము పనితీరు కనబరుస్తున్న రాష్ట్రం, వారు దానిని అంగీకరించడానికి నిరాకరిస్తారు, మమ్మల్ని గౌరవంగా చూడరు' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.