వారేనంటూ పోచారం నింద: హరీష్కు దేవినేని ఫోన్
హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్తు సంక్షోభానికి గత కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలే కారణమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి విమర్శించారు. శనివారంనాడు నిజామాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బొగ్గును ఆంధ్రకు తరలిస్తుంటే కాంగ్రెసు, టిడిపిలు చూస్తూ ఉండిపోయాయని ఆయన అన్నారు.
రైతు ఆత్మహత్యలను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. పంట ఎండిపోయి, ఆర్థిక ఇబ్బందులతో మరణించిన రైతు కుటుంబాలను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
ఇదిలావుంటే, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావుకు ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఫోన్ చేశారు. రాయలసీమకు మంచినీటి ఇబ్బందులు రాకుండా శ్రీశైలం ఎడమ కాలువ విద్యుదుత్పత్తిని నిలిపివేసేందుకు సహకరించాలని దేవినేని ఉమ హరీష్ రావును కోరారు.

లాఠీచార్జీపై భగ్గుమన్న జానా రెడ్డి
కరీంనగర్లో శుక్రవాంర రైతాంగ సమస్యలై ధర్నా చేసిన తమ పార్టీ నాయకులపై లాఠీచార్జీ చేయడం అమానుషమని తెలంగాణ కాంగ్రెసు సీనియర్ నేత, ప్రతిపక్ష నేత కె. జానా రెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెసు నేతలు ఇచ్చిన వినతి పత్రాన్ని తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ ముందుకు రాకపోవడం విచారకరమని ఆయన అన్నారు.
అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు రైతాంగ సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన విమర్శించారు. తక్షణమే తెలంగాణ శానసభ సమావేశాలను ఏర్పాటు చేసి కరువు, రైతాంగ సమస్యలపై చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు.
సొంత పార్టీ నేతలపై పాల్వాయి ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర వహించడంలో తమ పార్టీ నేతలు ఘోరంగా విఫలమయ్యారని కాంగ్రెసు సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ఇదే విషయాన్ని తాను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టికి తీసుకుని వెళ్లినట్లు ఆయన శనివారం మీడియా ప్రతినిధులకు తెలిపారు.
కాంగ్రెసుకు సమర్థ నాయకత్వం లేకపోవడం వల్ల తెరాస ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టలేకపోతున్నామని ఆయన అన్నారు. త్వరలోనే సిఎల్పీ, పిసిసి నాయకత్వం మార్పు ఉంటుందని ఆయన చెప్పారు. కేబినెట్ ర్యాంక్ కోసం శాసనసభ్యులను ప్రలోభ పెట్టి జానారెడ్డి ప్రతిపక్ష నేత అయ్యారని ఆయన తప్పు పట్టారు. కరెంట్, రుణమాఫీ వంటి సమస్యలను పరిష్కరించడంలో కెసిఆర్ ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications