పోడు వివాదం: అటవీ అధికారులపై తిరగబడ్డ చెంచులు-కిరోసిన్ చల్లిన మహిళ-తీవ్ర ఉద్రిక్తత
తెలంగాణలో పోడు భూముల సమస్య ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉంది. ఫలితంగా ఆదివాసీలకు,అటవీ అధికారులకు మధ్య తరచూ గొడవలు తలెత్తుతూనే ఉన్నాయి. పోడు భూములను స్వాధీనం చేసేందుకు అధికారులు యత్నించడం... ఆదివాసీలు తిరగబడటం కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది. గతంలో కాగజ్నగర్ సమీపంలోని సార్సాలలో అటవీ అధికారిపై జరిగిన దాడి ఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. తాజాగా నాగర్కర్నూల్ జిల్లాలోనూ చెంచు రైతులు అటవీ అధికారులపై తిరగబడ్డారు.
భూమిని స్వాధీనం చేసుకునేందుకు...
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో 60 ఎకరాల పోడు భూమి ఉంది. స్థానికులైన 20 మంది చెంచులు గత 30 ఏళ్లుగా ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు. ఆ భూమి పైనే ఆధారపడి బతుకుతున్న చెంచులకు గత నెలలో అటవీ శాఖ నోటీసులు పంపించింది. పోడు భూములను వదిలిపెట్టాలని... వాటిని సాగు చేయొద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఆ నోటీసులను చెంచులు తిరస్కరించారు. ఇదే క్రమంలో శుక్రవారం(జులై 2) అధికారులే స్వయంగా రంగంలోకి దిగారు.
తిరగబడ్డ చెంచులు...
పోడు భూములు ఉన్న ప్రాంతానికి కూలీలతో వెళ్లి కందకాలు తీయడం మొదలుపెట్టారు. అక్కడ చెట్లు నాటేందుకు మార్కింగ్ చేయాలనుకున్నారు. కానీ ఇంతలోనే విషయం తెలుసుకున్న చెంచులు అక్కడికి వచ్చి పోలీసులతో గొడవపడ్డారు. 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని ఎలా స్వాధీనం చేసుకుంటారని ప్రశ్నించారు. ప్రాణాలైనా ఇస్తాం గానీ భూమిని వదులుకునేది లేదని తేల్చి చెప్పారు. దీంతో పోలీసులకు,చెంచు మహిళలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
కిరోసిన్ చల్లిన మహిళ... ఉద్రిక్తత...
వాగ్వాదం జరుగుతున్న సమయంలోనే ఓ చెంచు మహిళ కిరోసిన్ను తనపై చల్లుకుంది. ఆపై అధికారులపై కూడా కిరోసిన్ను చల్లింది. ఆమె అగ్గిపుల్ల గీసేందుకు యత్నిస్తుండగా అక్కడే ఉన్న కొందరు ఆమెను అడ్డుకున్నారు. దీంతో ప్రమాదం తప్పినట్లయింది. విషయం తెలుసుకున్న అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలకు ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోడు భూముల విషయంలో చెంచులను ఇబ్బంది పెట్టవద్దని 15 రోజుల క్రితమే అటవీ అధికారులకు చెప్పామని బాలరాజు తెలిపారు. త్వరలోనే ఈ విషయాన్ని మరోసారి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
గతంలో కాగజ్నగర్లో....
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ పరిధిలో ఉన్న సార్సాల గ్రామంలో 2019లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. సార్సాల గ్రామ శివారులోని 20 హెక్టార్ల భూమిలో చెట్లు నాటేందుకు అటవీ అధికారులు వెళ్లగా స్థానికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా... స్థానిక ఎమ్మెల్యే సోదరుడి మనుషులు అటవీ అధికారిపై అమానుషంగా దాడి చేశారు. ఈ దాడి అప్పట్లో రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. ఆ భూములను తాము చాలా కాలంగా సాగు చేసుకుంటున్నామని అక్కడి స్థానికులు వెల్లడించారు. నిజానికి పోడు భూముల సమస్య ఏళ్లుగా అపరిష్కృతంగానే ఉంది.పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో పలుమార్లు హామీలు,ప్రకటనలు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకూ ఆ దిశగా అడుగు పడలేదు.