ప్రణయ్ కేసు కొలిక్కి: చంపింది బీహార్ శర్మ, భారీ సుఫారి, ఫ్యామిలీతో సుదీర్ఘంగా మాట్లాడి...
Recommended Video

నల్గొండ/మిర్యాలగూడ/హైదరాబాద్: ప్రణయ్ హత్య కేసులో మరో వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. సంచలనంగా మారిన ఈ హత్య కేసులో నిందితుడిని పోలీసులు గుర్తించారు. అతనిని చంపింది బీహార్కు చెందిన శర్మగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. శర్మను బీహార్లో అరెస్ట్ చేసిన పోలీసులు అతనిని నల్గొండకు తరలిస్తున్నారు.
ప్రణయ్ హత్య కేసులో ఏడుగురు నిందితులు ఉన్నారని ఓ ఛానల్తో ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు. ప్రణయ్ను హత్య చేసింది బీహార్కు చెందిన శర్మ అన్నారు. అతనిని బీహార్లో అదుపులోకి తీసుకున్నామని, అక్కడి కోర్టులో హాజరుపరిచామని తెలిపారు.

అమృత కుటుంబ సభ్యుల రక్షణ పరిశీలిస్తాం
నిందితుడిని హైదరాబాదుకు తరలిస్తామని ఎస్పీ చెప్పారు. హత్యకు రూ.1 కోటి డీల్ కుదిరిందని వెల్లడించారు. రూ.18 లక్షలు అప్పటికే చెల్లించారని తెలిపారు. కులాంతర వివాహం వల్లే మారుతిరావు ప్రణయ్ పైన కక్ష పెంచుకున్నారని ఎస్పీ తెలిపారు. అమృత కుటుంబ సభ్యుల రక్షణపై పరిశీలన చేస్తామని తెలిపారు.

నయీం గ్యాంగ్కు, వేములకు సంబంధం లేదు, విగ్రహానికి నో
నయీం గ్యాంగుకు ప్రణయ్ హత్యతో సంబంధం లేదని ఎస్పీ తెలిపారు. హత్యతో తెరాస నేత వేముల వీరేశంకు ఎలాంటి సంబంధం లేదని, అందుకు తగిన ఆధారాలు లేవని వెల్లడించారు. మిర్యాలగూడలో ప్రణయ్ విగ్రహ ఏర్పాటుకు అనుమతించబోమని తెలిపారు. అతిప్రేమ, తన బిడ్డ తనకు కావాలన్న కోరికతోనే ప్రణయ్ హత్యకు ప్లాన్ వేశారని ఎస్పీ తెలిపారు. అవతలి వ్యక్తి ధనవంతుడు కావడం వల్లే, హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్ ఇంత భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిందని, అందుకు మారుతీరావు కూడా అంగీకరించాడన్నారు. కేసును మూడు రోజుల్లోనే ఛేదించామని, స్క్రీన్ మీద కనిపిస్తున్న పాత్రధారి ఒకరేనని, దీని వెనుక చాలామంది ఉన్నారన్నారు. ఈ కేసులో అమృత ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే వీరేశం, నయీమ్ గ్యాంగ్ల ప్రమేయంపై, విచారణ జరిపిస్తామన్నారు. అమృత స్టేట్ మెంట్ తీసుకోవాల్సి ఉందని చెప్పారు.

ప్రణయ్ కుటుంబ సభ్యులతో సుదీర్ఘంగా మాట్లాడారు
కాగా, ప్రణయ్ కుటుంబ సభ్యులతో పోలీసులు సుదీర్ఘంగా మాట్లాడారు. అనుమానితుల వివరాలు సేకరించారు. వివిధ కోణాల్లో దర్యాఫ్తు చేశారు. అదుపులోకి తీసుకున్న నిందితులను విచారించారు. అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేసిన పోలీసులు చివరకు దర్యాఫ్తును కొలిక్కి తెచ్చారు. పోలీసులు ఆదివారం రాత్రి వరకు ప్రణయ్ కుటుంబ సభ్యులతో మాట్లాడారని తెలుస్తోంది.

బీహార్ సుభాష్ శర్మ
మారుతీరావుకు సన్నిహితుడిగా భావిస్తున్న సూర్యాపేటకు చెందిన ఓ న్యాయవాది, తాజా మాజీ ఎమ్మెల్యే పేర్లను అమృత పదేపదే ప్రస్తావించిన అంశాన్ని పోలీసులు సీరియస్గానే తీసుకున్నారు. కానీ వారి పాత్ర లేదని గుర్తించారు. చివరకు బీహార్కు చెందిన సుబాష్ శర్మ సుఫారీ తీసుకొని హత్య చేసినట్లుగా గుర్తించారు.












Click it and Unblock the Notifications