కోదండరాం ముందస్తు అరెస్టు, విద్యార్థులు, కార్యకర్తలను కూడా: ర్యాలీపై ఉత్కంఠ
తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను బుధవారం తెల్లవారుజామున పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో బుధవారం నిరుద్యోగ ర్యాలీకి పిలుపునివ్వడంతో కోదండరాం.
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను బుధవారం తెల్లవారుజామున పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో బుధవారం నిరుద్యోగ ర్యాలీకి పిలుపునివ్వడంతో కోదండరాంను సికింద్రాబాద్లోని ఆయన నివాసంలో ముందస్తుగా అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు.
ఇప్పటికే పలువురు జేఏసీ కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై (ఫిబ్రవరి 22న) బుధవారం నిర్వహించనున్న ర్యాలీకి అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ జేఏసీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

జేఏసీ సభను నాగోలులో నిర్వహించేందుకు కోర్డు అనుమతివ్వబోగా జేఏసీ తన పిటిషన్ను ఉపసంహరించుకుంది. మంగళవారం సాయంత్రం కోదండరాం నివాసంలో చర్చించిన జేఏసీ ఇందిరాపార్కు వద్ద నిరసన కార్యక్రమాలను యథాతథంగా శాంతియుతంగా నిర్వహిస్తామని చెప్పింది.
కాగా, పలు విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. అప్రమత్తమైన పోలీసులు నగరంలో మోహరించారు. నగరంలోకి వస్తున్న పలువురు కార్యకర్తలు, విద్యార్థులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. ర్యాలీలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ర్యాలీ జరుగుతుందా? లేదా? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
కోదండరాంను సాయంత్రం విడుదల చేస్తాం: డీసీపీ
శాంతిభద్రతల రిత్యా కోదండరామ్ను ముందస్తుగా అరెస్టు చేసినట్లు తూర్పుమండల డీసీపీ రవీంద్ర తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన్ను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఇందిరాపార్క్తో సహా నగరంలో ఎక్కవడా ర్యాలీకి అనుమతి లేదని అయన పేర్కొన్నారు. నిరుద్యోగ ర్యాలీలో ఎవరూ పాల్గొనవద్దని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications