డ్రగ్ మాఫియా: సినీ నిర్మాత అరెస్టు.. కదలుతున్న తుట్టె!?
నగరంలో వెలుగుచూసిన డ్రగ్ మాఫియా కేసులో పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిలో ఒకరు సినీ నిర్మాతగా తెలుస్తోంది.
హైదరాబాద్: నగరంలో వెలుగుచూసిన డ్రగ్ మాఫియా కేసులో పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిలో ఒకరు సినీ నిర్మాతగా తెలుస్తోంది. వీరి నుంచి 16ఎల్ఎస్డి డ్రగ్స్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తాజా అరెస్టులతో డ్రగ్ మాఫియా కేసులో ఇప్పటిదాకా 10మందిని అరెస్టు చేసినట్లయింది.
డ్రగ్ మాఫియాలో కీలకంగా ఉన్న ఓ హోటల్ మేనేజ్మెంట్ నిర్వాహకుడిని బుధవారం ప్రశ్నించిన పోలీసులు.. అతని వద్ద నుంచి వివరాలు రాబట్టినట్లు సమాచారం. ఆ మేరకే అరెస్టులు జరిగి ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, బెండెన్ బెన్, నిఖిల్ షెట్టి కలిసి తెరలేపిన ఈ డ్రగ్ మాఫియాకు గోవా నుంచి సరుకు సరఫరా అవుతున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్దారించారు. కేసులో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్ గోవా నుంచే డ్రగ్స్ తీసుకొచ్చి నిఖిల్ షెట్టి సహా ఇతరులకు విక్రయించినట్లుగా గుర్తించారు.
ఇదే క్రమంలో గోవాలోనే ఓ సినీ నిర్మాతకు డ్రగ్స్ అందించినట్లు చెబుతున్నారు. డ్రగ్ మాఫియా టార్గెట్స్ స్కూల్స్, కాలేజీలే అని తేలడంతో.. నగరంలోని పలు కళాశాలల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ఎక్కడ తమ పేరు బయటపడుతుందోనన్న టెన్షన్ వారిలో నెలకొంది. కెల్విన్ ను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని వివరాలు రాబట్టవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.
సోషల్ మీడియాలో పలు స్కూల్స్ పేర్లు బయటకు రావడంతో.. తల్లిదండ్రుల్లోను ఆందోళన పెరిగిపోయింది. అయితే అవేవి నిజం కాదని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. వివరాలను గోప్యంగా ఉంచుతున్నామని ఆయన పేర్కొన్నారు. స్కూల్స్, కాలేజీలు, సినీ ఇండస్ట్రీతో పాటు ఎంఎన్ సీ కంపెనీలతో ఈ మాఫియా లింకులు ఉన్నాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.