స్వామిని తరలించడంలో హైడ్రామా, 'పరిపూర్ణానంద బహిష్కరణ వెనుక..!'
Recommended Video

హైదరాబాద్/కాకినాడ: శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామిని కాకినాడ తరలింపులో హైడ్రామా చోటు చేసుకుంది. గత ఏడాదిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ స్వామిని పోలీసులు ఇప్పుడు నగరం నుంచి బహిష్కరించారు. కొందరిని సంతృప్తిపరిచేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆయనను హైదరాబాద్ నుంచి కాకినాడకు తరలించారు. ఈ సమయంలో హైడ్రామా చోటు చేసుకుంది. మార్గమధ్యంలో ఖమ్మం జిల్లా వైరా మండలంలోని స్టేజీ పినపాక గ్రామం వద్ద నేషనల్ హైవేపై కొంతసేపు హైడ్రామా చోటుచేసుకుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం పరిపూర్ణానందను భద్రాచలం శ్రీరాముని దర్శనానికి తీసుకువెళ్లకుండా నేరుగా కాకినాడకు తరలించటానికి పోలీసులు ప్రయత్నించారు.

దీంతో స్వామి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నగర బహిష్కరణ తర్వాత పరిపూర్ణానందను భద్రాచలం రామయ్య దర్శనం చేసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఆ మేరకు భద్రాద్రి రామాలయ అధికారులకు సమాచారం కూడా ఇచ్చారు.
పినపాక వద్దకు వచ్చిన తర్వాత అల్పాహారం చేసేందుకు ఒక హోటల్ వద్ద ఆగారు. ఆ సమయంలో పరిపూర్ణానంద వాహనంలోనే ఉండిపోయారు. స్టేజి పినపాక దాటి కొంత దూరం ప్రయాణించాక భద్రాచలం, కాకినాడ వెళ్లే రోడ్లు చీలిపోతాయి. పోలీసులు కాకినాడ వైపు బయలుదేరగా పరిపూర్ణానంద వారితో వాగ్వాదాగానికి దిగారు. దాదాపు అరగంట పాటు హైడ్రామా చోటు చేసుకుంది. ఆ తర్వాత ఆయనను సత్తుపల్లి మీదుగా కాకినాడకు తరలించారు.
న్యాయం చేయమని అడిగితే పోలీసులు తనపై బహిష్కరణ వేటు వేశారని, దీనిపై ఎవరూ ఆవేశాలకు లోనుకావొద్దని, హిందువుల మనోభావాలతో ఆటలు ఆడుకుంటున్న వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని పరిపూర్ణానంద పిలుపునిచ్చారు. పరిపూర్ణానందస్వామిని బహిష్కరించడం వెనుక మజ్లిస్ ఉందని బీజేపీ ఆరోపించింది. మజ్లిస్ చెప్పినట్లుగా కేసీఆర్ నడుచుకుంటున్నారని విమర్శించారు.
పరిపూర్ణానందపై కేసులు
మెదక్ జిల్లా నారాయణకేడ్లో మక్కా, జెరూసలేం వెళ్లేందుకు సబ్సిడీలు ఇస్తున్నాయని, హిందువులకు ఎందుకు ఇవ్వడం లేదని 1 నవంబర్ 2017లో ప్రశ్నించారు.
కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లిలో నిజాం పాలన కావాలా, ఛత్రపతి శివాజీ పాలన కావాలా అని 2 డిసెంబర్ 2017న అడిగారు.
కరీంనగర్లో మాట్లాడుతూ.. హిందూ మహిళలపై రజాకార్లు దహనకాండ కొనసాగించారని, నిజమాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్, అదిలాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్ పేర్లు మార్చాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు 11 మార్చి 2018న చేశారు. పరిపూర్ణానంద స్వామిపై ఈ మూడు కేసులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications