పోలీస్ ఉద్యోగ వేటలో యువకుడు దుర్మరణం
ఇబ్రహీంపట్నం/ హైదరాబాద్ : ఎదిగొచ్చిన కొడుకు కుంటుంబానికి అండగా ఉంటాడనుకుంటే కాన రాని లోకాలకు వెళ్లిపోయి ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు ఓ కొడుకు. 'అమ్మా.. ఈసారి ఎలాగైనా పోలీసు ఉద్యోగం సాధిస్తా' అని పట్టుదలతో చెప్పిన ఓ యువకుడి గుండె అదే ప్రయత్నంలో ఆగిపోయింది. కొలువు సాధించి కుటుంబానికి అండగా నిలుస్తాడని భావించిన కుమారుడి అకాల మరణం ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది.
ఈ హృదయ విదారక ఘటన రంగారెడ్డి జిల్లాలో గురువారం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు అనుబంధ గ్రామం మేటిళ్లకు చెందిన గుంటి నాగలక్ష్మి-యాదయ్య దంపతుల 23 ఏళ్ల కుమారుడు ఏకాంబరం పీజీ పూర్తి చేశాడు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన పోలీస్ ఉద్యోగాల భర్తీలో భాగంగా ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు.
దేహదారుఢ్య పరీక్షలకు (ఫిజికల్ టెస్టు) సన్నద్ధమవుతున్న క్రమంలో ఈ నెల 23న ఈవెంట్స్కు హాజరుకావాలని ప్రవేశపత్రం అందింది. దీంతో స్నేహితులతో కలిసి ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో సాధన చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే గురువారం పరుగెత్తుతుండగా ఒక్కసారిగా గుండెపోటుతో ఏకాంబరం కుప్పకూలాడు. సహచరులు ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఏకాంబరం తండ్రి యాదయ్య ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేసి ఇటీవలే ఉద్యోగ విరమణ పొందారు. తల్లి కూలీ పనులు చేస్తోంది. చదువులో ముందుండే తమ కుమారుడు ఉద్యోగం సాధిస్తే కుటుంబ కష్టాలు తొలగిపోతాయని భావించిన ఆ తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగిలాయి.