బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు: ఆలస్యంగా వెలుగులోకి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi kaushik Reddy) పాటు మరికొందరికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. బీఎన్ఎస్ 35(3) సెక్షన్ కింద హుజూరాబాద్ పోలీసులు నోటీసులు అందజేశారు. దళిత బంధు నిధులు విడుదల చేయాలని నవంబర్ 9న బీఆర్ఎస్ ధర్నా నిర్వహించింది. ఈ క్రమంలో అనుమతి లేకుండా హైవేపై కౌశిక్ రెడ్డి ధర్నా చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించారని నోటీసులిచ్చారు.
అధికార యంత్రాంగం అనుమతి లేకుండా రోడ్డుపై అక్రమంగా గుమిగూడటం, దళిత బంధు పథకం లబ్ధిదారులతో ధర్నా చేయడం, తెలిసి కూడా విద్వేష పూరిత ప్రసంగాలు చేయడం వంటి ఆరోపణలు కేసు పెట్టారు. ధర్నా, ఆందోళనను విరమించుకోవాలని పోలీసులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అభ్యర్థించినా తిరస్కరించారని చెప్పారు.

పోలీసు సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడంతోపాటు పోలీసులను నీచ పదజాలంలో తిట్టారని, చేతులతో నెట్టారని ఆరోపించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితోపాటు పలువురిపై బీఎన్ఎస్ యాక్ట్ 358/ యూ/ఎస్ 223, 126(2), 221, 189(2) ఆర్/డబ్ల్యూ 190, 359/2024 యూ/ఎస్ 223, 132, 126(2), 192, 189(2), 189(3)ఆర్/డబ్ల్యూ 190 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులను సంఘటన జరిగిన రోజు నవంబర్ 9నే నమోదు చేసినప్పటికీ.. ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం.
కాగా, గత కొంత కాలంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడం లేదని మండిపడుతున్నారు. సీఎం రేవంత్ తోపాటు మంత్రులపైనా విమర్శలు గుప్పించారు. బొగ్గు బూడిద రవాణాలో జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ భారీ అవినీతికి పాల్పడ్డారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ పాలనా విధానాలను కూడా అసెంబ్లీ లోపల, బయట, మీడియా సమావేశాల్లోనూ విమర్శలు చేశారు. ఎమ్మెల్యే ఫిరాయింపు వివాదంలో కౌశిక్ రెడ్డి స్వయంగా అరికపూడి గాంధీకి సవాల్ విసిరడం, ఆ తర్వాత ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సందర్భంగానూ కౌశిక్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications