కారుకు 'ప్రెస్' స్టిక్కర్... పోలీసులనే దబాయించిన చికెన్ వ్యాపారి... చివరికిలా అడ్డంగా బుక్కయ్యాడు
రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతున్నా కొంతమంది అనవసరంగా రోడ్లపై తిరుగుతున్నారు. ఏ పనీ లేకపోయినా వూరికే వాహనాలతో రోడ్ల పైకి వెళ్తున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు లేనిపోని కట్టు కథలు చెబుతున్నారు. కొంతమంది వాహనదారులు తమ వాహనాలపై 'ప్రెస్' అనే స్టిక్కర్ అంటించుకుని పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓ చికెన్ వ్యాపారి ఇలాగే చేయబోయి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
పోలీసుల కథనం ప్రకారం... తార్నాక ప్రాంతానికి చెందిన బొమ్మగాని ఉపేందర్ చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. లాక్ డౌన్ నేపథ్యంలో రోడ్లపై పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తుండటంతో తన కారుకు 'ప్రెస్' స్టిక్కర్ అంటించుకుని దర్జాగా తిరుగుతున్నాడు. ఇదే క్రమంలో గురువారం(మే 20) రాత్రి సీతాఫల్ మండి చౌరస్తాలో ఉపేందర్ కారును పోలీసులు ఆపారు.
ఈ సమయంలో బయట ఎందుకు తిరుగుతున్నావని పోలీసులు ప్రశ్నించగా... తాను మీడియా రిపోర్టర్ని అని చెప్పాడు. ప్రభుత్వమే మీడియా ప్రతినిధులకు అనుమతి ఇచ్చింది కదా అని దబాయించాడు. దీంతో పోలీసులు... ఏ మీడియా సంస్థలో పనిచేస్తున్నావో ఆ ఐడీ కార్డు చూపించాలన్నారు. ఏం చెప్పాలో తెలియక ఉపేందర్ నీళ్లు నమిలాడు. పోలీసులు కాస్త గట్టిగా అడిగేసరికి అసలు విషయం చెప్పాడు.
నిజానికి తాను చికెన్ సెంటర్ నిర్వహిస్తుంటానని... లాక్ డౌన్ సమయంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రెస్ అని కారుకు స్టిక్కర్ అంటించుకున్నానని చెప్పాడు. నిబంధనలు అతిక్రమించినందుకు ఉపేందర్పై పోలీసులు కేసు నమోదు చేసి కారు సీజ్ చేశారు. ప్రెస్ పేరిట పోలీసులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసినందుకు చీటింగ్ కేసు నమోదు చేశారు. లాక్ డౌన్ పీరియడ్లో ఉదయం 10గంటల తర్వాత ఎవరూ బయటకు రావొద్దని పోలీసులు మరోసారి విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Recommended Video
డీజీపీ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు లాక్డౌన్ను కఠినంగా అమలుచేస్తున్నారు. రోడ్లపై ముమ్మరంగా తనిఖీలు చేస్తూ పాసులు లేకుండా బయట తిరుగుతున్నవారికి జరిమానా విధిస్తున్నారు. అవసరమైతే కేసులు బుక్ చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్ల పైనే కాదు.. గల్లీలు,కాలనీల్లోనూ తిరగవద్దని హెచ్చరిస్తున్నారు.