దీపావళి ముందే పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి: పొంగులేటి శ్రీనివాస్ సంచలనం
సియోల్: తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార, పౌరసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకటి రెండు రోజుల్లోనే దీపావళి పండగకు ముందే పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయన్నారు. ప్రస్తుతం దక్షిణ కొరియాలోని సియోల్ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఓ మీడియా ఛానల్తో తాజాగా మాట్లాడారు.
ధరణి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి అంశాల్లో జరిగిన అక్రమాల్లో గత ప్రభుత్వంలోని ప్రధాన నేతలపైనే చర్యలు ఉంటాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కక్ష సాధింపు కోసం కాదు.. సాక్ష్యాధారాలతోనే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సాక్ష్యాధారాలతో ఫైళ్లన్నీ సిద్ధమయ్యాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. రిపోర్టులు త్వరలోనే వస్తాయన్నారు. తప్పు చేసినవారు ఎంతటివారైనా తప్పించుకోలేరని స్పష్టం చేశారు. దక్షిణ కొరియా నుంచి తాము వచ్చేలోగానే నిందితులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అయితే, మంత్రి వ్యాఖ్యలను గమనిస్తే.. గత ప్రభుత్వంలో కీలక వ్యవహరించిన నేతల అరెస్టులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మూసీ ప్రక్షాళన, అభివృద్ధిపై అధ్యయనం కోసం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు దక్షిణకొరియాలోని సియోల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. సియోల్ నగరంలో నది అభివృద్ధిపై విస్తృతంగా పర్యటించి వివరాలు తెలుసుకుంటున్నారు. హాన్ నదిని సందర్శించి నది పునరుద్ధరణ పనులను పరిశీలించారు. సియోల్లో నీటి సరఫరా, పర్యావరణ, ఆర్థిక వ్యవస్థకు ఈ నది ఎలా కీలకంగా మారిందనే విషయంపై ఆరా తీస్తున్నారు.
మరోవైపు, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ధరణి పేరు చెప్పి బీఆర్ఎస్ నేతలు భూముల్ని దర్జాగా దోచుకున్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్ ప్రారంభం నుంచి రైతులపాలిట శాపంగా మారిందన్నారు. ధరణి పోర్టల్ సమస్యల పుట్ట. మాజీ సీఎం కేసీఆర్ సదుద్దేశంతో తీసుకువచ్చారని అనుకున్నాం. కానీ, ఊరు పేరు లేని సంస్థకు ధరణిని అప్పగించారు. ఆ రెండు సంస్థలు కేటీఆర్, హరీశ్ రావుకి లోపాయికారీ ఒప్పందంగా ఉండి దర్జాగా భూములు కొల్లగొట్టారు. అందుకే ధరణి పోర్టల్ నిర్వహణను ఎన్ఐసీకి అప్పగించాం. అందులోని లోపాలు సరిచేస్తామని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications