మునుగోడులో మొదలైన పోలింగ్; అభ్యర్థుల్లో టెన్షన్; ఓటర్లకు పూలతో మోడల్ పోలింగ్ కేంద్రాల స్వాగతం!!
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మునుగోడులో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీనికోసం మొత్తం 298 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇక ప్రధాన పార్టీల నుండి ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులతో పాటు మొత్తం మునుగోడు బరిలో 47 మంది ఉన్నారు. వీరి భవితవ్యం ఈ రోజు ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది.

మునుగోడులో మొదలైన పోలింగ్
ఇక మునుగోడు నియోజకవర్గంలో మాక్ పోలింగ్ ప్రారంభించిన ఎన్నికల సిబ్బంది అంతా సక్రమంగా ఉందని నిర్ధారించుకున్న తరువాత పోలింగ్ ను ప్రారంభించారు. ఇక ఓటర్లు నిదానంగా మునుగోడు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉండగా, వారిలో 1,21,720 మంది పురుషులు, 1,20,128 మంది స్త్రీలు ఉన్నారు. నేడు మునుగోడులో పోటీలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం తేలనుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులలో ఉత్కంఠ నెలకొంది.

అభ్యర్థుల్లో టెన్షన్
టిఆర్ఎస్ పార్టీ నుండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి మునుగోడు లో విజయం సాధించడం కోసం విపరీతంగా ప్రచారం నిర్వహించారు. ప్రజలను తమవైపు తిప్పుకోవడం కోసం నానా అగచాట్లు పడ్డారు. ఇక మరి నేడు ఓటర్లు వారిలో ఎవరిని ఆదరిస్తారు అన్నది తేలనుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీల నేతలలో ఉత్కంఠ చోటుచేసుకుంది.

105 సమస్యాత్మక కేంద్రాల్లో భారీ భద్రత
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ కొనసాగుతోంది. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 105 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించిన ఎన్నికల అధికారులు అక్కడ బందోబస్తును మరింత పటిష్టంగా నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలు భారీగా మోహరించి ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి పహారా కాస్తున్నారు.

ప్రజలలో ఓటు వేసే ఉత్సాహం పెరిగేలా మోడల్ పోలింగ్ బూత్ లు
అంతేకాదు ప్రజలలో ఓటు వేయాలన్న భావనను పెంపొందించడానికి ఇప్పటికే వివిధ ప్రచార సాధనాల ద్వారా ఓటుహక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించిన అధికారులు పలు ప్రాతాల్లో మోడల్ పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు.. ప్రతి ఒక్కరూ పోలలింగ్ బూత్ కు వచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకునేలా మండలానికి ఒకటి చొప్పున పోలింగ్ బూత్ ఎంపికచేసి మోడల్ పోలింగ్ బూత్ గా మార్చారు. ఈపోలింగ్ బూతులను స్వాగత తోరణాలతో , టెంట్లు వేసి సుందరంగా తీర్చిదిద్దారు.

పూలతో అందంగా అలకరించి ఓట్ల పండుగకు స్వాగతం చెప్తున్న ఎన్నికల అధికారులు
ఒక ఆహ్లాద కరమైన వాతావరణంలో, శుభకార్యాన్ని తలపించేవిధంగా ఈ పోలింగ్ బూత్ ను అందంగా పూలతో అలంకరించారు... ప్రజలలో ఓటు వేయడానికి వచ్చేవారికి సహాయం చేసేందుకు ప్రారంభంలో రిసెప్షన్ కేంద్రం ఏర్పాటు చేశారు. భారతదేశ పౌరులమైన మేము ఓటరుగా గర్విస్తున్నాము. ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నానుములకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం, అనే నినాదాలతో ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఓటర్లను చైతన్య పరిచారు.

మునుగోడు ఎన్నికలు సజావుగా సాగడానికి అధికారుల ఏర్పాట్లు
ఇక మునుగోడు ఉప ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన మొత్తం 298 పోలింగ్ కేంద్రాలలో 105 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించిన అధికారులు, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో పాటు, ఎన్నిక సజావుగా సాగటానికి ప్రయత్నిస్తున్నారు. 14 వీడియో సర్వేలైన్స్ టీమ్లు, 199 మైక్రో అబ్జర్వర్లు, 1192 ఈవీఎంలు, 596 వి వి ప్యాట్లు, 596 కంట్రోల్ యూనిట్లు, ఒక్కో కేంద్రంలో 3 ఈవీఎంలు, 3365 మంది పోలీసు సిబ్బంది, 15 కంపెనీల కేంద్ర బలగాలు, 100 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి ఎన్నికల పోలింగ్ సజావుగా సాగడానికి పని చేస్తున్నారు. అంతే కాదు ఈ సారి కొత్తగా డిజిటల్ స్లిప్పులను ఓటు వినియోగానికి ఇవ్వనున్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా రాచకొండ పోలీస్ కమిషనరేట్ నుండి పోలింగ్ తీరును పర్యవేక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications