ప్రత్యేక హోదా: కెసిఆర్తో తిరుగుతూ.. జగన్పై టి కాంగ్రెస్ నేత ఆగ్రహం
హైదరాబాద్: తమ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలకు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలకు ఆగ్రహం తెప్పించింది. టి కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి జగన్ పైన మండిపడ్డారు.
రాహుల్ గాంధీ పైన జగన్ విమర్శలు అర్థరహితమన్నారు. జగన్కు నైతిక విలువలు ఏమాత్రం లేవన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతూ తమను విమర్శించడం ఏమిటన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర పాలన పైన దృష్టి పెట్టాలని పొంగులేటి సూచించారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రవేశ పెట్టిన ఆయా సంక్షేమ పథకాల పైన శ్వేతపత్రం విడుదల చేయాలని పొంగులేటి డిమాండ్ చేశారు.
తోటపల్లి రిజర్వాయర్ రద్దును వ్యతిరేకిస్తాం: ఉత్తమ్
తోటపల్లి రిజర్వాయర్ రద్దును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను వివాదాస్పదం చేసి కెసిఆర్ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో పాలన పడకేసిందని, కెసిఆర్ సిఎంగా విఫలమయ్యారన్నారు.
కేంద్రమంత్రుల్ని కలిసిన తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి
తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి మంగళవారం కేంద్రమంత్రులు హర్షవర్థన్, జేపీ నడ్డాలను కలిశారు. టిఆర్ఎస్ ఎంపీలతో పార్లమెంటులో ఆయన కేంద్రమంత్రులను కలిసి వివిధ అంశాలపై చర్చించారు.
రంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడికి కార్మిక సంఘాల యత్నం
పంచాయతీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మున్సిపల్ ఉద్యోగ, కార్మిక సంఘాల జెఏసి ఆధ్వర్యంలో కార్మికులు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా కార్మిక నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే రాజయ్య సహా కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.