అందుకే టిఆర్ఎస్లో చేరా: జగన్పై పొంగులేటి, 'కాంట్రాక్ట్'పై వివరణ
ఖమ్మం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వన్ సైడ్గా ఉండటం వల్లే తాను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరవలసి వచ్చిందని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్యం అన్నప్పుడే తాను ఖమ్మంలో ఎంపీగా గెలిచానని గుర్తు చేశారు. కానీ, విభజన అనంతరం జగన్ వన్ సైడ్గా మాట్లాడుతున్నారని, అందుకే తాను తెరాసలో చేరవలసి వచ్చిందని పొంగులేటి చెప్పారు.
తాను రాజకీయాలలోకి రాకముందే వ్యాపారవేత్తనని చెప్పారు. తనకు ప్రభుత్వం వందల కోట్ల రూపాయల కాంట్రాక్టులు కట్టబెడుతుందన్న వాదనలలో అర్థం లేదన్నారు. అవి అవాస్తవాలు అని చెప్పారు. తనకు వచ్చిన పనులన్నీ టెండర్ల ద్వారా దక్కినవేనని వివరించారు.
అలాగే, మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో విభేదాల పైన మాట్లాడారు. తనకు తుమ్మలతో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. గతంలో ఇరువురం వేర్వేరు పార్టీలలో ఉన్నాం కాబట్టి బేధాభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. జిల్లాలో ఎప్పుడు కూడా గ్రూపులు లేవని చెప్పారు.
ఏపీ అడ్డుకోవాలని చూస్తోంది: కేటీఆర్
మన ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని, మన ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందన్నారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇందిరాపార్కు దగ్గర పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేశారని, తమ పాలనలో కోతలు కరెంట్ ఇస్తున్నామన్నారు.