ఖమ్మం కాంగ్రెస్ ఏంపీగా పొంగులేటి..? చకచకా పావులు కదుపుతున్న టీపిసిసి..!!
హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వ్యూహాలకు ప్రతివ్యూహాలను రచిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసులు రెడ్డిని బరిలోకి దింపేందుకు ప్రణాళికలు రచిస్తోంది టీపిసిసి. ఖమ్మంలో ఉన్న బలమైన అభ్యర్థుల్లో మొదటగా పొంగులేటి శ్రీనివాసులు రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం పరిగణలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
మొన్న జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్వపక్ష పార్టీ అభ్యర్థులను ఓటమి పాలు చేయడంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు పొంగులేటిపై ఉన్నాయి. శ్రీనివాస రెడ్డి మూలంగానే టీఆర్ఎస్ అభ్యర్థులు పలు చోట్ల ఓటమి పాలైనట్లు సీఎం చంద్రశేఖర్ రావు ప్రగాడంగా విశ్వసిస్తున్నట్టు, అందులో భాగంగా లోక్ సభ ఎన్నికల్లో పొంగులేటికి టికెట్ నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక ఇదే అంశాన్ని క్యాష్ చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. 2014లో వైఎస్సార్సీపీ నుండి పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి గెలిచారు. తరువాత ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అయితే ఇద్దరు సిట్టింగ్ ఎంపీలకు ఈ సారి సీట్లు ఇవ్వనని పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలతో, పొంగులేటి వర్గంలో అయోమయం నెలకొంది. ఆయన అభ్యర్థిత్వంపై కారుచీకట్లు కమ్ముకున్నట్టు చర్చ జరుగుతోంది. గులాబీ బాస్ తనకు టికెట్ నిరాకరిస్తే తదుపరి కార్యాచరణపై పొంగులేటి అప్రమత్తంగా ఉన్నట్టు తెలుస్తోంది.
దీంతో ఆయన కాంగ్రెస్ పెద్దలతో టచ్ లో ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ నుండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బరిలోకి దించాలని కొందరు నేతలు సైతం టీపిసిసి కి సూచిస్తున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం స్థానం నుండి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపిస్తున్నా, సిట్టింగ్ అభ్యర్థికి అవకాశం ఇస్తే గెలుపుపై ధీమాగా ఉండొచ్చనేది కాంగ్రెస్ నేతల అంచనాగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలుగా పోటీచేసి ఓడిపోయిన వారితో పాటు, మాజీ ఎంపీలకు సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.