లక్షన్నర ఎకరాలకు నీరు: రేవంత్ రెడ్డికి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు
గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనుల పూర్తికి నిధులు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర సహచర మంత్రులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టుతో పాటు ఎస్ఆర్ఎస్పీ - ఐఎఫ్ఎఫ్సీలోని ప్యాకేజీ నంబర్ -7లోని పెండింగ్ పనుల పూర్తి చేయడానికి రూ 437 కోట్లు కేటాయిస్తూ గురువారం కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
సవరించిన అంచనా ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించింది. గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తయితే లక్షా ఆరు వేల (1,06,000 )ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో 57,852 ఎకరాలు,స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో 48,148 ఎకరాలకు సాగునీరు అందనుంది. గౌరవెల్లి ప్రాజెక్ట్ లో ఉన్న రెండు ప్రధాన కాలువల్లో కుడి కాలువ ద్వారా 90,000 ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 16 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.
గౌరవెల్లి ప్రాజెక్టు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. దీంతో పనులు నత్తనడకన సాగాయి. దీని తరువాత శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ లో పూర్తి చేసుకున్నప్పటికీ గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల ఇక్కడ రైతులకు నీళ్ళు అందని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాజెక్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రిజర్వాయర్ పనులు మొదలయ్యాయి.

జులై 13, 2007లో ఈ ప్రాజెక్ట్ ను ఎస్ఆర్ఎస్పి రెండవ దశ లో వరద ప్రవాహ కాలువ ప్రాజెక్ట్ కింద పనులు చేపట్టడానికి రూ.913.15 కోట్ల రూపాయలతో పనులు చేపట్టడానికి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. సంబంధిత రిజర్వాయర్ కాలువ పనులు చేపట్టడానికి ప్యాకేజీ -7 లో రూ. 278.58 కోట్ల రూపాయలను సమకూర్చింది. ఈ ప్రాజెక్ట్ కు అవసరమైన భూమి - 3919 ఎకరాలు కాగా ,సేకరించిన భూమి 1676 ఎకరాలు , సేకరించవలిసిన మిగులు భూమి 2243 ఎకరాలు గా ఉంది.
ప్రస్తుతం ప్రాజెక్ట్లో సీడీ అండ్ సిఎం పనులు పెండింగ్లో ఉన్నాయి. తాజాగా, కేటాయించిన నిధులతో పనుల్లో వేగం పుంజుకోనుంది. కాగా, పొన్నం ప్రభాకర్ గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా అయిన తరువాత ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్ట్ల లిస్ట్లో గౌరవెల్లి ప్రాజెక్ట్ను చేర్చి తన కమిట్మెంట్ ను నిరూపించుకున్నారు. గతంలో గౌరవెల్లి ప్రాజెక్ట్ పై బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై 2023 మార్చి 2వ తేదిన పొన్నం ప్రభాకర్ లతో కలిసి పిసిసి చీఫ్ హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్ ను సందర్శించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ప్రాజెక్ట్ ను సందర్శించినప్పుడు కుర్చివేసుకొని ప్రాజెక్ట్ పూర్తి చేస్తన్న కేసీఆర్ ఎందుకు చేయలేదని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ప్రాజెక్ట్ ప్రారంభించింది కాంగ్రెస్ అని పూర్తి చేసేది కూడా కాంగ్రెస్ అని ఆరోజు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు గురువారం ముఖ్యమంత్రి హోదాలో ప్రాజెక్ట్ కు నిధులు కేటాయించారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ పురోగతి పై మంత్రి పొన్నం ప్రభాకర్ నిత్యం వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ప్రభుత్వం పై ఒత్తిడి పెంచారు. అందులో భాగంగా హుస్నాబాద్ లో సిద్దిపేట జిల్లా అధికారులతో క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో గౌరవెల్లి ప్రాజెక్ట్ పెండింగ్ పనులు భూసేకరణపై రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. హుస్నాబాద్ IOCలో మూడు జిల్లాల కలెక్టర్ లు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ కాలువల నిర్మాణానికి వేగవంతంగా భూ సేకరణ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
త్వరలోనే ప్రాజెక్ట్ పూర్తి చేసుకొని నెర్రెలు బారిన పొరుగడ్డ హుస్నాబాద్ నియోజకవర్గంలో గోదావరి నీళ్ళు చేరి పాడి పంటలతో సస్యశ్యామలం అవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు గౌరవెల్లి ద్వారా నీళ్ళు అందించడమే తన జీవిత లక్ష్యమని ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు త్వరలోనే పూర్తి కానుండటంతో ఈ ప్రాంతం రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications