11వ తేదీ..11 గంటలకు ముహూర్తం పెట్టిన సీబీఐ - కవిత ఇంటి వద్ద భారీగా..!!
హైదరాబాద్: టీఆర్ఎస్కు చెందిన శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన ఘటన తెలంగాణలో రాజకీయ ప్రకంపనలకు తెర తీసింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రమేయం ఉందంటూ ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో- ఈ విచారణ చేపట్టనున్నారు సీబీఐ అధికారులు. ఆదివారం విచారణ ఆరంభం కానుంది. ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ఆమె నివాసంలో విచారణ మొదలు కానుంది.

అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్..
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న అమిత్ అరోరా అందించిన రిమాండ్ రిపోర్ట్లో కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించారంటూ వార్తలొచ్చిన మరుసటి రోజే సీబీఐ నుంచి నోటీసులు రావడం కలకలం రేపుతోంది. మరోవంక- టీఆర్ఎస్ నాయకులు ఈ నోటీసులపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోన్నారు. ఇవి విచారణ కోసం పంపించిన నోటీసులు కావని స్పష్టం చేస్తోన్నారు. ఆమె నుంచి వివరణ తీసుకోవాలనే ఉద్దేశంలో సీబీఐ అధికారులు ఉన్నారని చెబుతున్నారు.

నోటీసులకు ఉత్తరాలు..
నోటీసులు అందిన తరువాత సీబీఐ అధికారులకు కవిత రెండు సార్లు లేఖలు రాసిన విషయం తెలిసిందే. తనకు అందజేసిన 14035/06/2022 నోటీసుల్లో పొందుపరిచిన అంశాలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను తనకు అందజేయాలంటూ కిందటి ఆదివారం రాత్రి ఆమె సీబీఐ అధికారులను కోరారు. వీలైనంత త్వరగా వాటిని పంపించాలని, దీనివల్ల విచారణకు అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి, తగిన సమాధానాలను ఇవ్వడానికి తనకు వీలుగా ఉంటుందని చెప్పారు.

విచారణ కోసం తేదీలు..
ఆ తరువాత కూడా ఆమె రెండో లేఖను రాశారు. సీబీఐ అధికారులకు ఆప్షన్లు ఇచ్చారు. 6వ తేదీన అంటే మంగళవారం విచారణకు తాను హాజరు కాలేనని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఢిల్లీ సీబీఐ, ఏసీబీ విభాగాధిపతి రాఘవేంద్ర వత్సకు ఈ లేఖను పంపించారు. తాను రాసిన లేఖకు సరైన సమాధానం అందలేదని, నిర్దేశిత గడువులోగా విచారణకు హాజరుకాలేనని వివరించారు. ఎఫ్ఐఆర్ కాపీ, తనపై అందిన ఫిర్యాదులకు సంబంధించిన డాక్యుమెంట్లు వెబ్సైట్లో ఉన్నాయని సమాధానం ఇచ్చారని చెప్పారు.

ఈ నాలుగు తేదీల్లో..
మంగళవారానికి బదులుగా- ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో హైదరాబాద్లోని తన నివాసంలో విచారణ జరపొచ్చని కవిత సీబీఐ అధికారులకు దృష్టికి తీసుకెళ్లారు. చట్టాన్ని తాను ఎంతగానో గౌరవిస్తానని, అందుకే విచారణకు సహకరిస్తానని పునరుద్ఘాటించారు. తాను ప్రతిపాదించిన ఆయా తేదీల్లో ఏ రోజైనా సరే విచారణ కోసం హైదరాబాద్లోని తన నివాసానికి రావొచ్చని అన్నారు. చట్టపరంగా తనకు ఉన్న అధికారాలను నిష్పక్షపాతంగా వినియోగించుకోవడానికే విచారణకు సహకరిస్తున్నానని చెప్పారు.

ఆ ఆప్షన్ల ఆధారంగానే..
కవిత ఇచ్చిన ఈ నాలుగు తేదీల్లో 11వ తేదీని ఖరారు చేశారు సీబీఐ అధికారులు. ఉదయం 11 గంటలకు ఆమె నివాసానికి రానున్నారు. ఈ నేపథ్యంలో- కవిత ఇంటి వద్ద పెద్ద ఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలిశాయి. ఓ యోధుడి కుమార్తెగా కవితను అభివర్ణిస్తూ పోస్టర్లను కట్టారు. ఎప్పటికీ భయపడబోదని పేర్కొన్నారు. బీసీ జనసభ అధ్యక్షుడు, టీఆర్ఎస్ నాయకుడు రాజారాం యాదవ్ పేరు మీద ఈ బ్యానర్లు ఏర్పాటయ్యాయి.












Click it and Unblock the Notifications