అయిదు రోజులకు సరిపడేలా బొగ్గు నిల్వలు: సింగరేణి కాలరీస్: నాలుగు రాష్ట్రాలకు భరోసా
హైదరాబాద్: సింగరేణితో ఒప్పందం చేసుకున్న అన్ని రాష్ట్రాల థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైనంత మేరకు బొగ్గు సరఫరా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్లు ఎస్ చంద్రశేఖర్ (ఆపరేషన్స్), ఎన్ బలరాం (ఫైనాన్స్) తెలిపారు. తెలంగాణలో గల అన్ని థర్మల్ కేంద్రాల్లో కనీసం అయిదు రోజులకు సరిపడేలా బొగ్గు నిల్వలు ఉన్నాయని అన్నారు. ఫలితంగా- విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఉండబోదని చెప్పారు.

నాలుగు రాష్ట్రాలకు సరఫరా..
తెలంగాణ ఉత్తర ప్రాంతంలో అయిదు జిల్లాలకు పైగా విస్తరించి ఉంది సింగరేణి కాలరీస్ బొగ్గు గనులు. దక్షిణాది రాష్ట్రాల్లో అతి పెద్ద బొగ్గు గనులుగా పేరుంది. తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఇక్కడి నుంచి బొగ్గు సరఫరా అందుతుంటుంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు సింగరేణి కాలరీస్తో ఫ్యూయల్ సప్లై అగ్రిమెంట్ను కుదుర్చుకున్నాయి. ఏపీలో కడప జిల్లాలోని రాయలసీమ (ఆర్టీపీపీ-ఏపీ జెన్కో), మహారాష్ట్రలోని పర్లీ (మహా జెన్కో), కర్ణాటకలోని రాయచూర్ (కేటీపీపీ), తమిళనాడులోని మెట్టూర్ వద్ద గల థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సింగరేణి నుంచి బొగ్గు సరఫరా అవుతోంది.

మిగిలిన కేంద్రాలకూ బ్రిడ్జ్ లింకేజీ
తెలంగాణలోని రామగుండం వద్ద గల నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఆదిలాబాద్ జిల్లాలో సింగరేణి సొంతంగా నిర్మించుకున్న థర్మల్ విద్యుత్ కేంద్రంతో పాటు బ్రిడ్జ్ లింకేజీ ఉన్న విజయవాడ శివార్లలోని డాక్టర్ నార్ల తాతారావు, మహారాష్ట్రలోని కొరడి, షోలాపూర్లోని ఎన్టీపీసీ, కర్ణాటక రాయచూర్ సమీపంలోని చిక్క సుగూర్లో గల యర్మారస్ థర్మల్ కేంద్రానికీ సింగరేణి నుంచే బొగ్గు అందుతుంటుంది. సింగరేణి గనుల్లో రోజూ ఉత్పత్తి అయ్యే బొగ్గులో 86 శాతం.. అంటే 1.5 లక్షల టన్నులు థర్మల్ కేంద్రాలకే సరఫరా అవుతుంది.

సరఫరాపై పర్యవేక్షణ..
దేశంలో బొగ్గు కొరత నెలకొన్నట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో సింగరేణి కాలరీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ ఆదేశాల మేరకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) జే ఆల్విన్, జీఎం (కో ఆర్డినేషన్) కే సూర్యనారాయణ, మార్కెటింగ్ జనరల్ మేనేజర్ కే రవిశంకర్తో కలిసి అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బొగ్గు ఉత్పత్తి, రవాణాని సమీక్షించారు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.

లక్ష్యాలను అందుకునేలా..
వర్షాలు తగ్గుముఖం పట్టడం వల్ల నిర్దేశిత లక్ష్యాల మేరకు బొగ్గు ఉత్పత్తి సాధించాలని అధికారులు ఏరియా మేనేజర్లకు ఆదేశించారు. దేశంలో పలు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత ఉందన్న వార్తలు వస్తున్నప్పటికీ.. తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదని వారు పేర్కొన్నారు. అక్టోబర్లో రోజూ 1.9 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని, దానికి అనుగుణంగాపని చేస్తున్నామని అన్నారు. 34 ర్యాకులకు తగ్గకుండా బొగ్గు రవాణా చేయాలని పేర్కొన్నారు.

ఏరియాల వారీగా టార్గెట్లు..
బొగ్గు ఉత్పత్తి, రవాణా పెంచడంలో ఏరియాలకు ఎదురవుతున్న ఇబ్బందులు, వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై డైరెక్టర్లు అన్ని ఏరియాల జీఎంలకు దిశా నిర్దేశం చేశారు. కొత్తగూడెం ఏరియా నుంచి ప్రతీ రోజూ ఏడు ర్యాకుల్లో బొగ్గు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇల్లందు-5, మణుగూరు-5, ఆర్జీ-2 ఏరియా- 7, బెల్లంపల్లి, ఆర్జీ ఏరియా వన్ నుంచి ఒక్కొక్కటి, మందమర్రి- 3, శ్రీరామ్పూర్-5 ర్యాకుల మేర చొప్పున బొగ్గు రవాణా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.

99.24 శాతం లక్ష్యాన్ని అందుకున్న సింగరేణి..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు త్రైమాసికాల్లో థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరాలో లోటు రాలేదని సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వివరించారు. భారీ వర్షాలు కురుసిన రోజుల్లోనూ యథాతథంగా బొగ్గు సరఫరా చేశామని అన్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం మొత్తం తొలి రెండు త్రైమాసికాల్లో 273.54 లక్షల టన్నులను సరఫరా చేయాల్సి ఉండగా.. 271.46 లక్షల టన్నులను అందించామని అన్నారు. 99.24 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications