కష్టాలు తెలుస్తున్నాయి: ప్రకాశ్రాజ్, దత్తత గ్రామం కోసం ‘వెజ్మంత్ర’
హైదరాబాద్: తనకు వ్యవసాయదారుల కష్టాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయని ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్ చెప్పారు. కొద్ది రోజులుగా తాను వ్యవసాయం చేస్తున్నందున రైతుల కష్టాలు తెలియని, ఎన్నో కష్టాలు పడుతూ పంటలు పండిస్తున్న రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
గురువారం సాయంత్రం మణికొండ పంచాయతీ పరిధిలోని చిత్రపురి కాలనీలో 'వెజ్ మంత్ర' పేరుతో తాజా కూరగాయల విక్ర య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహజ ఎరువులతో పండించే పంటలను తినాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉందన్నారు.
సమాజానికి సేవలదించాలనే ఉద్దేశంతోనే మహబూబ్నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకున్నట్టు చెప్పారు. అక్కడ పండుతున్న కూరగాయలను నేరుగా వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాననని తెలిపారు. తాను పొలం కొని వ్యవసాయం చేస్తున్నందున రైతుల బాధలు తెలిశాయన్నారు .
ఆ గ్రామంలోని రైతుల కూరగాయలన్నీ నేరుగా ప్రజలకు అందించేలా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. తాను సినిమా నేపథ్యమున్న కుటుంబానికి చెందిన వ్యక్తిని కావటంతో మొదటగా చిత్రపురి నుంచి మొదలు పెడుతున్నానని తెలిపారు.
దత్తత తీసుకున్న గ్రామంలోని మిగతా రైతులందరితోనూ సహజ ఎరువులతోనే పంటలను పండించి రాబోయే రోజుల్లో మరిన్ని చోట్ల ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేయిస్తానని ప్రకాశ్ రాజ్ తెలిపారు.
కాగా, ప్రకాశ్ రాజ్ తాను దత్తత తీసుకున్న గ్రామంలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. గ్రామస్తులతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. తాగునీరు, రోడ్లు, పాఠశాల వంటి వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే ఆ గ్రామంలో ఉచిత హెల్త్క్యాంప్ కూడా నిర్వహించారు.