ప్రశాంత్ కిషోర్ సర్వే: TRSకు ఎన్ని సీట్లంటే..?..సగం మంది మంత్రులకు గట్టి పోటీ?
తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఎన్నికల వ్యూహకర్తగా నియమితులైన ప్రశాంత్ కిషోర్ ప్రతి నెలకోసారి ప్రభుత్వ పనితీరుపై సర్వే నిర్వహింపచేస్తున్నారు. ఈసారి టీఆర్ఎస్ కూడా సొంతంగా మరో రెండు సర్వేలు నిర్వహింపచేస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న సర్వేతోపాటు, జిల్లా అధ్యక్షుల సర్వే కూడా ఉంది. ఆగస్టు 15వ తేదీకి తుది నివేదికలు, సర్వే చేసిన సంస్థల వివరాలు, వాటి శాంపిల్స్ అందజేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

చెమటోడ్చాల్సి ఉంటుంది
ఇంకా పూర్తి స్థాయి నివేదికలు అందనప్పటికీ ఇందులో సగం మంది మంత్రులకు వారి వారి నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఎదురవబోతోందని తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీల తరఫున గట్టి అభ్యర్థులు నిలబడితే వీరు చెమటోడ్చాల్సి ఉంటుందని సమాచారం. కేటీఆర్, హరీష్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, పువ్వాడ అజయ్కుమార్, శ్రీనివాస్గౌడ్, జగదీష్రెడ్డి, నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్ పరిస్థితి బాగానే ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అయితే భవిష్యత్తులో చోటుచేసుకోబోయే రాజకీయ పరిణామాలు, నియోజకవర్గాల్లో ఎదురయ్యే ప్రత్యర్థులను బట్టి సానుకూలతలు వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉందనే భావన కూడా వ్యక్తమవుతోంది.

హ్యాట్రిక్ విజయం ఖాయం?
సర్వేలో ప్రభుత్వ పథకాల పట్ల సానుకూలత వ్యక్తమవుతోందని, కొత్తగా రేషన్ కార్డుల మంజూరుతోపాటు పింఛన్లు కూడా ఇస్తే హ్యాట్రిక్ విజయం దక్కుతుందని పీకే చెప్పినట్లు సమాచారం. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడా అప్పులు రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని, ఈ విషయాన్ని ప్రజలకు వివరించగలిగితే విజయం ఇంకా సులువవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమైన నగదును సమకూర్చుకోనివ్వకుండా, కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటాను ఇవ్వకుండా నరేంద్రమోడీ, అమిత్ షా కేసీఆర్ ను ఇబ్బంది పెడుతున్నారు అనేది స్లోగన్ గా చేసుకొని ప్రజల్లోకి వెళ్లగలిగితే విజయమనేది నల్లేరుపై నడకలా సాగుతుందని భావిస్తున్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల దగ్గర అప్పు పుట్టనివ్వకుండా కేంద్రం అడ్డుకుంటోందంటూ కేసీఆర్ మొదటి నుంచి బీజేపీపై ఫైరవుతున్నారు. ఆర్థికంగా కొంత వెసులుబాటు లభిస్తే రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.

40 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మార్పు?
రాబోయే ఎన్నికల్లో దాదాపు 40 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను మార్చాలనే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. పనితీరు నచ్చకపోతే మంత్రులనైనా ఖాతరు చేయనని, అవసరమైతే సీటు నిరాకరిస్తానని ఆయన ఖరాఖండిగా తేల్చిచెప్పారు. దీంతో మంత్రులు కూడా తమ తమ నియోజకవర్గాల్లో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పూర్తిస్థాయి నివేదికలు అందిన తర్వాత వాటన్నింటినీ క్రోడీకరించి కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకుంటారని, ఆ తర్వాతే ముందస్తు ఎన్నికలపై ఒక స్పష్టత వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications