ప్రశాంత్ కిషోర్ వర్సెస్ సునీల్ : రేవంత్ కు మద్దతుగా రంగంలోకి -అటు అమిత్ షా : గెలిచేదెవరు..!!
తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. కొత్త సమీరణాలు తెర మీదకు వస్తున్నాయి. రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలు మూడు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. దీంతో..మూడు పార్టీలు ముందు నుంచే తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రెండో సారి వరుసగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ముచ్చటగా మూడో సారి అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే పలు నిర్ణయాల ప్రకటనతో పాటుగా..సీఎం కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదే సమయంలో ప్రశాంత్ కిషోర్ టీఆర్ఎస్ కు రాజకీయ వ్యూహకర్తగా పని చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేసీఆర్ సైతం చెప్పుకొచ్చారు. ప్రశాంత్ కిషోర్ తమతో కలిసి పని చేస్తున్నారని స్పష్టం చేసారు.

కేసీఆర్ కోసం ప్రశాంత్ కిషోర్
ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ యువతలో ఉద్యోగాల కల్పన పైన ఉన్న ఆగ్రహం...కొందరు ఎమ్మెల్యేలపైన వ్యతిరేకత.. మంత్రుల్లో పని తీరు వంటి వాటి పైన సీఎం కేసీఆర్ కు నివేదిక ఇచ్చారు. ప్రజల మూడ్ పైన సర్వేలు చేయిస్తున్నారు. దీంతో..అటు కాంగ్రెస్ అలర్ట్ అయింది. కేసీఆర్ ను ఢీ కొట్టాలంటే సమర్ధులు కావాలనే ఉద్దేశంతో టీపీసీసీ చీఫ్ గా రేవంత్ ను నియమించింది.
అయితే, రేవంత్ నియామకం తరువాత పార్టీలో అంతర్గత సమస్యల పరిష్కారానికే సమయం సరిపోతోంది. ఇదే సమయంలో రేవంత్ కు తోడుగా.. ప్రశాంత్ కిషోర్ కు పోటీగా కాంగ్రెస్ అధినాయకత్వం ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ను రంగంలోకి దించింది. ఆయనను తెలంగాణ నేతలకు 4 వతేదీన రాహుల్ గాంధీ పరిచయం చేయనున్నారు.

రేవంత్ కు మద్దతుగా సునీల్
పార్టీ నేతలంతా ఆయనకు పూర్తిగా సహకరించాలని, ఆయన వ్యూహం ప్రకారం ఎన్నికల ప్రచారంలోకి దిగాలని రాహుల్ పార్టీ నేతలకు చెప్పనున్నారు. కాగా సునీల్ కనుగోలుతో సమావేశంలోనే భవిష్యత్ కార్యాచరణ నిర్ణయం అవుతుందని, ఉద్యమాల తీరుతెన్నులు, బహిరంగ సభల నిర్వహణ ఆ తర్వాతే మొదలవుతాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సమావేశానికి శ్రీధర్బాబు, జీవన్ రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హనుమంతరావుతో పాటు పలువురు నేతలను ఢిల్లీలో అందుబాటులో ఉండాల్సిందిగా అధినాయకత్వం సూచించింది.
రేవంత్ ఒన్ మ్యాన్ షో చేస్తున్నారనే విమర్శల నేపథ్యంలో.. ఇక నుంచి వ్యక్తి కేంద్రీకృత కార్యక్రమాలు కాక, పార్టీ కేంద్రీకృత కార్యక్రమాలు ఎక్కువ చేయాల్సి ఉన్నదని, 4న జరిగే సమావేశంలో ఈ మేరకు వ్యూహరచన ఖరారవుతుందని చెబుతున్నారు.

స్వయంగా అమిత్ షా పర్యవేక్షణ
ఇక, బీజేపీ హైకమాండ్ తెలంగాణ పైన ప్రత్యేకంగా గురి పెట్టింది. స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా తెలంగాణ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ నెలలోనే అమిత్ షా రెండు రోజులు తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. తెలంగాణలో పని చేసేందుకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంపిక చేసిన నేతలకు ఇక్కడి బాధ్యతలు అప్పగిస్తున్నారు. సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం..ముఖ్యమంత్రి ప్రధాని మోదీ లక్ష్యంగా రాజకీయంగా పోారటం ప్రారంభించటంతో.. కేసీఆర్ కు ఆయన సొంత రాష్ట్రంలో పొలిటికల్ గా చెక్ పెట్టాలని బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది.

గెలిచేదెవరు.. ఎవరి వ్యూహాలు సక్సెస్ అయ్యేను
దీంతో..పార్టీ ముఖ్య నేతలు ఈ నెలలో తెలంగాణలో పర్యటించనున్నారు. కార్యక్రమాల నిర్దేశంతో పాటుగా అభ్యర్ధుల ఎంపిక పైన ఇప్పటికే సర్వేలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని బీజేపీ -కాంగ్రెస్ అంచనా వేసినా..సీఎం కేసీఆర్ మాత్రం అటువంటి అవకాశం లేదని తేల్చి చెప్పారు. దీంతో..రానున్న ఎన్నికలకు మూడు పార్టీలు హోరా హోరీ పోరుకు సిద్దం అవుతున్నాయి. ఈ పోరులో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో.. ఎటువంటి సమీకరణాలకు కారణం అవుతాయో అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications