హైకోర్టు తెలంగాణదే, బాబుకు లేఖ రాశా: సదానంద, ఏం చేస్తారో చేసుకోండి: కవితపై వెంకయ్య ఫైర్
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఉన్న హైకోర్టు తెలంగాణ రాష్ట్రానికే చెందుతుందని, ఏపీకి కొత్త హైకోర్టును త్వరలో ఏర్పాటు చేస్తామని, ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశామని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ బుధవారం లోకసభలో చెప్పారు.
హైకోర్టు విభజన అంశం లోకసభలో చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా సదానంద గౌడ మాట్లాడారు. ఇప్పుడున్న హైకోర్టు తెలంగాణ రాష్ట్రానిదేనన్నారు. కొత్త హైకోర్టుకు మౌలిక వసతులు కల్పించవలసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వమేనని చెప్పారు.
ఏపీ కోరుకున్న చోట కొత్త హైకోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. ఎంత త్వరగా చెబితే అంత త్వరగా హైకోర్టు ఏర్పాటు ఉంటుందన్నారు. ఏపీ హైకోర్టు స్థలానికి అన్వేషణ చేయవలసి ఉందని చెప్పారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నింటికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.

ఏ స్థలంలో హైకోర్టు ఏర్పాటు చేయాలో ఏపీ సర్కార్ నిర్ణయించుకోవాలన్నారు. విభజన అంశం హైకోర్టులో ఉందని, అందుకే ఇప్పుడు చెప్పలేమన్నారు. టిఆర్ఎస్ ఎంపీలు కవిత, జితేందర్ రెడ్డి హైకోర్టు విభజన విషయమై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం సహకరించడం లేదన్న కవిత వ్యాఖ్యలతో సదానంద విభేదించారు.
దీనిపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా స్పందించారు.
ఏపీ, తెలంగాణలు సమానం: వెంకయ్య
తమకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాలు సమానమేనని, రెండు రాష్ట్రాలను ఒకే విధంగా చూస్తామని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. హైకోర్టు విభజనకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. హైకోర్టు విభజనను రాజకీయం చేయవద్దన్నారు. తెలుగు రాష్ట్రాలు ఒకటే అన్నారు.
సభలో లేని వ్యక్తుల పేర్లను ప్రస్తావించవద్దని, సభలో చిన్నపిల్లలా మాట్లాడవద్దని ఎంపీ కవితకు హితవు పలికారు.
మీరు ఏం చేస్తారో చేసుకోండని అవసరమైతే ప్రత్యేక హైకోర్టుపై సదానంద చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని చెబుతామన్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ హామీలు నెరవేర్చలేదన్నారు. అవసరమైతే వాటి పైన కూడా మాట్లాడుతామన్నారు. హైకోర్టు విభజన పైన కవిత చేసిన వ్యాఖ్యలపై వెంకయ్య ఆగ్రహించారు.
రతన్ టాటాతో కేటీఆర్ భేటీ
టాటా సన్స్ చైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటాతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం ముంబైలో భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో తెలంగాణ ప్రభుత్వం టీ హబ్ను త్వరలో ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని రతన్ టాటాకు కేటీఆర్ ఆహ్వానం పలికారు.
తెలంగాణలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు సహకారమందించేందుకు టీ హబ్ పేరిట కేసీఆర్ సర్కారు ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రం దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ గా ఖ్యాతిగాంచనుంది. రతన్ టాటా లాంటి వారి సలహాలు ఈ కేంద్రానికి ఎంతో ఉపయోగపడతాయన్న భావనతోనే ఆయనను ఆహ్వానించినట్లు కేటీఆర్ తెలిపారు. కేటీఆర్ ప్రతిపాదనకు రతన్ టాటా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications