తెలంగాణ కొత్త జోన్లకు కేంద్రం ఆమోదం: ఇక స్థానికులకే 95శాతం ఉద్యోగాలు
Recommended Video

న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ కొత్త జోన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏడు జోన్లకు, రెండు మల్టీ జోన్లకు గురువారం రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. కొత్త జోనల్ వ్యవస్థతో స్థానికులకే 95శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి. కొత్త జోన్లకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీలకు కృతజ్ఞతలు తెలిపారు.

మోడీని కలిసిన నేపథ్యంలో..
కొత్త జోన్ల ఆమోదం కోసం ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ ఆవశ్యకతను వివరించారు. జోనల్ వ్యవస్థను ఆమోదిస్తేనే తదుపరి ఉద్యోగ నియామకాలు చేపట్టే వీలు ఉంటుందని పేర్కొన్నారు. దీంతో ఎన్నాళ్ల నుంచో అపరిష్కృతంగా ఉన్న నూతన జోనల్ వ్యవస్థకు ప్రధాని నరేంద్ర మోడీ ఆమోద ముద్ర వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమైన తర్వాత ఇందుకు సంబంధించిన దస్త్రంపై మోడీ సంతకం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కొత్తగా అమల్లోకి వచ్చే జోనల్ వ్యవస్థ ప్రకారం ఆయా శాఖల్లో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులను వర్గీకరించి, సర్వీస్ నిబంధనలు మార్చుకొని సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి అన్నిశాఖల కార్యదర్శులకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు.

నాలుగేళ్లు చదివితే స్థానికత..
తెలంగాణలో ప్రస్తుతమున్న రెండు జోన్ల స్థానంలో ఇక ఏడు కొత్త జోన్లు ఏర్పడతాయి. అందులో మొదటి నాలుగు జోన్లను ఒక మల్టీజోన్గా మిగిలిన మూడు జోన్లను రెండో మల్టీ జోన్గా పరిగణిస్తారు. మరో వైపు ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువులో వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులు అవుతారు.

ఏడు జోన్లు, 2 మల్టీ జోన్లు
కాళేశ్వరం జోన్: జిల్లాలు: భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జనాభా: 28.29 లక్షలు.
బాసర జోన్: జిల్లాలు: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జనాభా: 39.74 లక్షలు.
రాజన్న జోన్: జిల్లాలు: కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, జనాభా: 43.09 లక్షలు.
భద్రాద్రి జోన్: జిల్లాలు: వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనాభా: 50.44 లక్షలు
యాదాద్రి జోన్: జిల్లాలు: సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ, జనాభా: 45.23 లక్షలు
చార్మినార్ జోన్: జిల్లాలు: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, జనాభా: 1.03 కోట్లు
జోగుళాంబ జోన్: జిల్లాలు: మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, వికారాబాద్, జనాభా: 44.63 లక్షలు.
మల్టీజోన్ల పరిధిలోకి వచ్చే జోన్లు:
1. కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి
2. యాదాద్రి, చార్మినార్, జోగుళాంబ.

స్థానికులకే 95శాతం ఉద్యోగాలు
కాగా, తాజాగా రూపొందించిన జోనల్ వ్యవస్థలో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగాల్లో 95శాతం స్థానిక రిజర్వేషన్ కల్పించారు. 5 శాతం మాత్రమే ఓపెన్ క్యాటగిరీ ఉంటుంది. స్థానికులు మెరిట్ సంపాదించుకొని ఓపెన్ క్యాటగిరీలో ఉద్యోగం పొందే అవకాశం కల్పించారు. రాష్ట్ర క్యాడర్ను రద్దు చేయడంతో ఈ 5 శాతం ఓపెన్ క్యాటగిరీలోనూ తెలంగాణలోని 31 జిల్లాలకు చెందిన నిరుద్యోగులు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగనుంది.












Click it and Unblock the Notifications