తెలంగాణ అసెంబ్లీ రద్దు, రాష్ట్రపతి పాలన?: రాజకీయ సన్యాసం అంటూ ఉత్తమ్ సంచలనం
ఫిబ్రవరి నెల చివరి నాటికి తెలంగాణ అసెంబ్లీ రద్దై.. రాష్ట్రపతి పాలన వస్తుందని జోస్యం చెప్పారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి నెల చివరి నాటికి తెలంగాణ అసెంబ్లీ రద్దై.. రాష్ట్రపతి పాలన వస్తుందని జోస్యం చెప్పారు. రాష్ట్రపతి పాలనలోనే ముందస్తు ఎన్నికలు జరపాలని పార్లమెంటులో కేంద్రాన్ని కోరతామన్నారు ఉత్తమ్. సూర్యపేట జిల్లా కోదాడలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ చిత్తుచిత్తుగా ఓడిపోతుందన్నారు.పోలీసులు, రెవెన్యూ అధికారులు.. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తొత్తులుగా మారుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దళితబంధులో అవకతవకలు జరగకుండా పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు. దళితబంధు గురించి హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని.. ఇందులో ఎమ్మెల్యేల ప్రమేయం ఉండకూడదని స్పష్టం చేసిందన్నారు. కానీ, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇందులో పాలుపంచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ ఈ పథకం అమలు చేయాలన్నారు.
రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రతతో దేశంలో కాంగ్రెస్ గాలి వీస్తోందన్నారు ఉత్తమ్. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రపంచ చరిత్రలో అరుదైన సంఘటన అని ఉత్తమ్ కొనియాడారు. రాహుల్ గాంధీతో కలిసి తాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 450 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని చెప్పారు. దేశాన్ని బీజేపీ మతపరంగా చిన్నాభిన్నం చేసిందన్నారు.
కోదాడ, హుజూర్నగర్లో కాంగ్రెస్ పార్టీ 50వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తుందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ మెజార్టీ రాకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలో 25 శాతం ఓటింగ్ లీడ్లో ఉన్నామని ఆయన తెలిపారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించగా.. కోదాడ అసెంబ్లీ స్థానం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందారు.