ప్రధాని మోడీ పుట్టుకతో బీసీ కాదు.. కన్వర్టెడ్ బీసీ - సీఎం రేవంత్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పుట్టుకతో బీసీ కులస్థుడు కాదని.. గుజరాత్ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీ జాబితాలో చేర్చుకున్నారని ఆరోపించారు. సర్టిఫికెట్ ప్రకారం మాత్రమే మోడీ బీసీ వ్యక్తి.. ఆయన వ్యక్తిత్వం మాత్రం అగ్ర కులం అంటూ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు హైదరాబాద్ గాంధీభవన్లో నిర్వహించిన కులగణన, ఎస్సీ వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజంటేషన్లో సీఎం ప్రసంగించారు. ముఖ్యమంత్రి చేసిన ఈ కామెంట్స్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
అలానే త్యాగానికి సిద్ధపడే.. కులాల లెక్కలు పక్కాగా తేల్చామని రేవంత్ రెడ్డి చెప్పారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ ఆదర్శం నిలబెట్టేందుకు తాను కార్యకర్తగా మిగిలేందుకు సిద్ధమని తెలిపారు. తాను ఆఖరి రెడ్డి సీఎంను అయినా పర్వాలేదని.. తమ నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టేందుకు క్రమక్షశిణ కలిగిన ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నని వ్యాఖ్యానించారు. కొందరు ఆరోపిస్తున్నట్టు కులగణన సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని వెల్లడించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు ఇంటి ముందు మేలుకొలుపు డప్పు కొట్టాలని బీసీ సంఘాలకు విజ్ఞప్తి చేశారు. సర్వేలో పాల్గొనకపోతే సామాజిక బహిష్కరణే శిక్ష అని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.

ఇప్పుడు కులగణన సర్వేను తప్పు పడితే బీసీలు శాశ్వతంగా నష్టపోతారని సూచించారు. దేశం మొత్తం కూడా కులగణన సర్వే జరగాలని పార్లమెంట్లో మోదీని రాహుల్గాంధీ నిలదీశారని గుర్తు చేశారు. ఈ సర్వే జరగకూడదని మోడీ, కేసీఆర్ కలిసి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కులగణన జరిగితే చట్ట ప్రకారం రిజర్వేషన్లు సాధించుకోవచ్చని వివరించారు. అధికారిక లెక్కలు ఉంటే బీసీల రిజర్వేషన్లు పెంచాలని సుప్రీంకోర్టుకు కూడా చెప్పొచ్చు అన్నారు. కుల గణన సర్వే రెండో విడత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇక అంతకు ముందు యూత్ కాంగ్రెస్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఆ సభలో మాట్లాడుతూ.. పదవులు రావొచ్చు రాకపోవచ్చు కానీ ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని నేతలకు సీఎం పిలుపునిచ్చారు.మాజీ సీఎం కేసీఆర్ గట్టిగా కొడతానంటూ చేస్తున్న కామెంట్స్ పై సైతం రేవంత్ సెటైర్లు వేశారు. ముందుగా కొడితే గట్టిగా కేటీఆర్ ను కొట్టాలని.. పిచ్చి మాటలు మాట్లాడే కేటీఆర్ ను కంట్రోల్ చేయాలని సూచించారు. కేసీఆర్ వద్ద లారీల కొద్ది డబ్బులు ఉన్నాయని.. ఆయన ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసన్నారు.
కేంద్ర మంత్రి వర్గంలో ఉన్న తెలంగాణ బీజేపీ నేతలు రాష్ట్రానికి తెచ్చింది జీరో అంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా పన్ను చెల్లిస్తున్నారని.. ఆ విషయాన్ని కేంద్రం గుర్తుతెచ్చుకోవాలన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు బుగ్గకార్లలో తిరగడం కాదని తెలంగాణ కోసం ఏమి తెచ్చారో చెప్పాలన్నారు. త్వరలో కేంద్రం పై పోరాటానికి కార్యాచరణ ఉంటుందని, అందుకు యూత్ కాంగ్రెస్ సిద్ధంగా ఉండాలని సీఎం పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications